Friday, April 26, 2024

అన్నప్రసాద వితరణ..

అల్వాల్‌ : ప్రస్తుతం యావత్‌ ప్రపంచం ఎదుర్కొంటున్న కరోనా వైరస్‌ సంక్షోభం నుంచి సమస్త మానవాళిని సంరక్షించాలని కోరుతూ అల్వాల్‌పట్టణ పరిధిలోని కానాజీగూడలో వెలసిన ప్రసిద్ద మరకత శ్రీలక్ష్మీగణపతి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈమేరకు ఆలయ వ్యవస్థాపకులు, కార్యనిర్వాహకులు డాక్టర్‌ మోత్కూరు సత్యనారాయణశాస్త్రి నేతృత్వంలో స్వామివారికి అభిషేకాలతో పాటుగా ప్రత్యేక హోమాలను చేపట్టడం జరిగిందని ఆలయ నిర్వాహకులు వెల్లడించారు. ఈసందర్భంగా ఆలయవ్యవస్థాపకులు సత్యనారాయణశాస్త్రి మాట్లాడుతూ ప్రస్తుత తరుణంలో మానవసేవయే మాధవ సేవగా పరిగణిస్తూ మానవతా విలువలను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు. ఈదశలో కోవిడ్‌-19 సంక్షోభం నుంచి సమస్త మానవాళి సంరక్షణను కోరుతూ ప్రతిరోజు మరకత శ్రీలక్ష్మీగణపతి ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజాకార్యక్రమాలను నిర్వహించడం జరుగుతోందని వెల్లడించారు. ఈతరుణంలో స్వామివారికి ప్రీతికరమైన మోదకాలు, జాస్మైన్‌ పుష్పాలతో హోమాలను నిర్వహించినట్లు తెలిపారు. ఆలయంలో ఆధ్యాత్మిక శోభను ప్రతిబింబజేస్తూ అదేతరుణంలో తమవంతు బాధ్యతగా సామాజిక సేవా కార్యక్రమాలను చేపట్టడం జరుగుతోందని ఆయన పేర్కొన్నారు. ఇందులో భాగంగానే ఆలయ అన్నప్రసాద ట్రస్టు ఆద్వర్యంలో ఆలయ ప్రాంగణంతో పాటుగా నగరంలో నిత్యం అన్నప్రసాద వితరణను చేపడుతున్నామని తెలిపారు. కోవిడ్‌-19 దృష్ట్యా సికింద్రాబాద్‌లోని చిలకలగూడ చౌరస్తాలో గత 362రోజులుగా అన్నార్థుల ఆకలిదప్పులను తీర్చే సంకల్పంతో అన్నప్రసాద వితరణను కొనసాగిస్తున్నామని సత్యనారాయణశాస్త్రి వివరించారు. ఇట్టి కార్యక్రమాన్ని నగరంలోని మరిన్ని ప్రాంతాలకు విస్తరింపజేయనున్నామని ఆయన పేర్కొన్నారు. ఆలయ అన్నప్రసాద ట్రస్టుకు చేయూతనివ్వదలచిన వారు ఆలయాన్ని నేరుగా గానీ లేదా 9949060885, 9440987638 ఫోన్‌ నెంబర్‌లను సంప్రదించవచ్చని ఆయన తెలిపారు. కేవలం మానవతా దృక్పదంతో మరకత శ్రీలక్ష్మగణపతి ఆలయం ఆద్వర్యంలో తాము ఇట్టి కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతోందని సత్యనారాయణశాస్త్రి వివరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement