Saturday, May 4, 2024

TS | జహీరాబాద్‌కు ఫార్మా సిటీ తెస్తాం.. ఉద్యోగాలు ఇస్తాం : రేవంత్

సంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ ప్రచార సభకు సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయ‌న‌ మాట్లాడుతూ… కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అంటే అది కార్యకర్తల కష్టం… గొప్పతనమే అని కొనియాడారు. భుజం కాయలు కాసేలా కార్యకర్తలు పార్టీ జెండాను మోశారన్నారు. తెలంగాణ రాష్ట్రం ఇస్తే ఆంధ్రాలో రాజకీయంగా నష్టపోతామ‌ని తెలిసినా సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చారని రేవంత్ రెడ్డి అన్నారు. సోనియమ్మ రాష్ట్రాన్ని ఇచ్చిన తర్వాత పదేళ్లు కేసీఆర్ చేతుల్లో తెలంగాణ కూరుకుపోయిందన్నారు.

తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయని రాష్ట్ర యువత ఉద్యమం చేసింద‌ని… ఈ పదేళ్లలో కేసీఆర్ ఏనాడూ పేదల ఉద్యోగాల గురించి పట్టించుకోలేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఎల్బీ స్టేడియంలో 25వేల మందికి నియామక పత్రాలు ఇచ్చామన్నారు. జహీరాబాద్‌కు ఫార్మా సిటీని తీసుకువచ్చి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. సోనియా గాంధీ ఆరు గ్యారెంటీలు ఇచ్చారని… మనం అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ఐదు గ్యారెంటీలను అమలు చేశామన్నారు.

నాడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 25 లక్షల ఇందిరమ్మ ఇళ్లు ఇస్తే ఆ ఇళ్లు డబ్బాలు అన్న కేసీఆర్ ఇన్నేళ్లలో ఇచ్చిన డబుల్ బెడ్రూంలు ఎన్ని అని ప్రశ్నించారు. కేసీఆర్ తన బిడ్డ కోసం బీజేపీని గెలిపించాలనుకుంటున్నారని.. నరేంద్ర మోదీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తుందని హెచ్చరించారు. మోదీ, అమిత్ షాలు కలిసి రిజర్వేషన్లను రద్దు చేయాలని నిర్ణయించుకున్నారన్నారు. రిజర్వేషన్ల రద్దు బీజేపీ విధానం అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement