Friday, April 26, 2024

కేసీఆర్ అంటే మోడీకి వణుకు .. పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను చూస్తే ప్రధాని మోడీకి వణుకు పుడుతుందని పెద్దపల్లి పార్లమెంటు సభ్యులు బోర్లకుంట వెంకటేష్ నేత పేర్కొన్నారు. బుధవారం పెద్దపల్లి జిల్లా పెద్దపంకూరులో మీడియాతో మాట్లాడుతూ… తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు ప్రపంచంలో ఎక్కడా లేవని, రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి కేంద్రం ఓర్వలేకపోతుందన్నారు. కేంద్ర ప్రభుత్వ పనితీరును ముఖ్యమంత్రి కేసీఆర్ విమర్శిస్తే కక్ష్య‌ సాధింపు ధోరణికి పాల్పడటం సిగ్గుచేటన్నారు.

తెలంగాణపై కేంద్రం పూర్తిగా వివక్ష చూపుతోందని, రాష్ట్ర అభివృద్ధికి ఒక్క‌ రూపాయి కూడా కేటాయించడం లేదన్నారు. ఎంపీ ల్యాడ్ ను రద్దు చేసిన ఘనత బీజేపీకే దక్కుతుందన్నారు. కేంద్రం సహకరించకున్నా.. రాష్ట్రంలోని ప్రతి గ్రామాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ అభివృద్ధి బాటలో పయనింపజేస్తున్నారన్నారు. సంక్షేమ పథకాలను చూసి ఓర్వలేక రాష్ట్ర ప్రభుత్వంపై అసత్యపు ఆరోపణలు చేస్తున్నారని.. తెలంగాణ ప్రజలు వీటిని గమనిస్తున్నారన్నారు. ఈ సమావేశంలో పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డితో పాటు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement