Tuesday, May 14, 2024

టీకాతో ధైర్యం క‌ల్పిద్దాం – కార్మికులే ఇం’ధ‌నం’

పరిశ్రమలకు అండగా నిలుద్దాం
సీరియస్‌గా యోచిస్తున్న సర్కార్‌
వ్యాక్సినేషన్‌తో సమస్య నివారణ
గతేడాదీ దన్నుగా రాష్ట్ర ప్రభుత్వం
దేశవ్యాప్తంగా తెలంగాణకు గుర్తింపు

హైదరాబాద్‌, వలసలకు భరోసానిచ్చి.. ఎలా నిలుపుదల చేయాలన్న అంశంపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్‌గా చర్చిస్తోంది. వ్యాక్సినేషన్‌, వైద్యసాయం వంటి అంశాలను పరిశీలిస్తోంది. పారిశ్రామిక రంగం.. ఒడిదుడుకులకు లోనుకావొద్దని, ఈ వలస కార్మికుల ఎఫెక్ట్‌ పడకుండా ఏ చర్యలు తీసుకోవాలో.. సమీక్షిస్తోంది. ఆర్థికవృద్ధికి పరిశ్రమలే కీలకం. రాష్ట్రంలోని హైదరాబాద్‌ ప్రైవేట్‌ పరిశ్రమకు.. వలస కార్మికులే ప్రధాన ఇంధనంగా మారారు. అన్నిరకాల పరిశ్రమల్లోనూ, దినసరి కూలీలు అవసరమైన ప్రతి రంగంలోనూ.. ఇతర రాష్ట్రాల కార్మికులే ఎక్కువగా పనిచేస్తున్నారు. బీహార్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, రాజస్థాన్‌ మహా రాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌ తదితర ప్రాంతాలకు చెందిన కార్మికులు 8లక్షల మందికి పైగా పనిచేస్తున్నారు. కరోనా విజృంభణ, ఇతర రాష్ట్రాల్లో విధిస్తున్న లాక్‌డౌన్‌లు, కర్ఫ్యూల నేపథ్యంలో హైదరాబాద్‌కు వలస వచ్చిన కార్మికులు పెద్ద ఎత్తున సొంత గ్రామాలకు తరలివెళ్తున్నారు. కార్మికులు ఇలా వెళ్ళిపోతుంటే.. ఆర్థిక రంగంపై నిర్మాణరంగంపై తీవ్ర ప్రభావం పడుతుందని యాజమా న్యాలు కార్మికులను బతిమిలాడుతున్నాయి. పలు పారిశ్రామిక సమాఖ్యలు పరిస్థితిని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు దృష్టికి తీసుకెళ్ళాయి. దీంతో ఈ అంశంపై సర్కారు ప్రభావిత నివారణ చర్యలు ప్రారంభిం చింది. ఫ్రంట్‌లైన్‌ వారియర్లకు చేసినట్లు వలస కార్మికులు వ్యాక్సినేషన్‌ జరగలేదు. ఏమైనా జరిగితే.. కరోనా వస్తే తమను ఆదుకునే వారు ఉండరని వలస కార్మికులు మళ్ళీ సొంతూరికి పయనమవుతున్నారు. వీరికి వ్యాక్సినేషన్‌ పూర్తిగా చేయించి ఆరోగ్యభద్రతకు, వైద్యానికి భరోసా కలిగించకుంటే.. మళ్ళీ లాక్‌డౌన్‌ నాటి పరిస్థితులు ఖాయంగా కనిపిస్తున్నాయి. దీనిని గుర్తించిన ప్రభుత్వం వ్యాక్సినేషన్‌ దిశగా ప్రయత్నాలు చేస్తోంది. ప్రస్తుతం 45ఏళ్ళు నిండిన వారికే వ్యాక్సిన్‌ వేస్తుండగా, వలస కార్మికులకు పూర్తిస్థాయి వ్యాక్సినేషన్‌ ఇవ్వాల్సిన ఆవశ్యకతను కేంద్రం దృష్టికి తీసుకెళ్ళినట్లు తెలుస్తోంది.
కేసీఆర్‌ ఒక్కరే
గత ఏడాది లాక్‌డౌన్‌ సమయంలో దేశవ్యాప్తంగా వలస కార్మికులు నడవలేక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వందల కిలోమీటర్లు నడుస్తూ.. నడుస్తూ అనేకమంది గమ్యాన్ని చేరలేక అనేకమంది మృత్యువాత పడ్డారు. వలస కార్మికులు పడుతున్న ఇబ్బందులకు చలించి.. వారూ.. మా బిడ్డలే. మా అభివృద్ధిలో భాగస్వాములే అంటూ ప్రకటించి ముఖ్యమంత్రి కేసీఆర్‌ దేశంలో సంచలనం సృష్టించారు. వలస కార్మికులకు కూడా తెలంగాణ ప్రజల తరహాలోనే రేషన్‌ బియ్యం, నగదు అందిం చిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్ఫూర్తిగా నిలిచారు. ఇతర రాష్ట్రాలకు ఇది ఆదర్శప్రాయమైంది. వలస కార్మికులకు ఎక్కడికక్కడ ప్రత్యేక శిబిరాలు ఏర్పాటుచేసి ఆదుకున్నారు. దేశంలో వలస కార్మికులకోసం నేనున్నా.. అని భరోసానిచ్చారు. ప్రత్యేక రైళ్ళు కూడా ఇపుడు.. లాక్‌డౌన్‌లు, కర్ఫ్యూల దిశగా దేశం సాగుతున్నా.. వలస కార్మికులకు వ్యాక్సినేషన్‌, భరోసా అంశంపై ఎవరూ దృష్టి నిలపలేదు. దీనిపై తెలంగాణ ప్రభుత్వమే ముందుగా అలర్ట్‌ అయింది. టెస్ట్‌ల సంఖ్య భారీగా పెంచడంతో పాటు.. ఇంకా వలస కార్మికులకు ఏం కావాలన్న అంశంపై ప్రతిపాదనలు రూపొం దించాలని అధికార యంత్రాంగానికి సూచనలు చేసింది. వలస కార్మికులు భయంతో స్వగ్రామాల బాట పడితే లాక్‌డౌన్‌ లేకున్నా.. ఆర్థికరంగంపై ఈ వలసలు, కరోనా విజృంభణ తీవ్ర ప్రభావాన్ని చూపనుంది.
మళ్ళీ మొత్తం వ్యవస్థ కుదేలు కానుం ది. పారిశ్రామిక వేత్తల వినతులు, గత ఏడాది అనుభవాలు, ఇబ్బందుల నేపథ్యంలో.. తెలంగాణ సర్కార్‌ వలస కార్మికులకు భరోసానిచ్చే అంశంపై దృష్టిపెట్టింది. ఇప్పటికే ఎట్టిపరిస్థితు ల్లోనూ నైట్‌ కర్ఫ్యూ, లాక్‌డౌన్‌ ఉండదని ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం వలసల నివారణ చర్యలు యుద్ధప్రాతిపదికన చేపట్టింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement