క్రికెట్ లో టీమిండియా సరికొత్త రికార్డును సృష్టించింది. అంతర్జాతీయ వన్డే క్రికెట్ ఛేజింగ్ లో అత్యధికంగా 300 సార్లు విజయం సాధించిన జట్టుగా టీమిండియా అరుదైన రికార్డు సృష్టించింది. సౌతాఫ్రికాతో రెండో వన్డేలో గెలుపుతో ఈ ఘనత సాధించింది. ఈ దరిదాపుల్లో కూడా ఏ జట్టు లేకపోవడం గమనార్హం. ఆస్ట్రేలియా (257), వెస్టిండీస్ (247) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన పర్యాటక జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 50ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 278 పరుగులు చేసింది కేశవ్ మహరాజ్ బృందం.
లక్ష్య ఛేదనకు దిగిన టీమిండియాకు గొప్ప ఆరంభం లభించలేదు. కెప్టెన్ శిఖర్ ధావన్ (13), మరో ఓపెనర్ శుభ్ర్మన్ గిల్ (28) స్థాయికి తగ్గట్లు రాణించలేకపోయారు. ఆ తర్వాత వచ్చిన ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ బౌలర్లకు చుక్కలు చూపించారు. అయ్యర్ సెంచరీ చేయగా… కిషన్ మాత్రం సెంచరీని చేజార్చుకున్నాడు. అయితే నిన్న సాధించిన విజయంతో భారత్ కొత్త రికార్డును నమోదు చేసింది.