Wednesday, May 8, 2024

Spl Story: గర్భం దాల్చరు, పిల్లలకు పాలుపట్టరు.. సరోగసీ విధానంతో మాతృత్వపు మురిపెం తీరుతుందా?

మాతృత్వం అనేది ఆడాళ్లకి ఓ వరం అంటారు. పిల్లలు కలగడం లేదని కోటి దేవుళ్లకు మొక్కుకునే వారు ఉంటారు. ప్రతి గుడికి తిరిగి ప్రత్యేక పూజలు చేసే వారుంటారు. అయినా ఇప్పటికీ చాలామందికి మాతృత్వం దక్కకుండా పోతోంది. దాంతో కుటుంబంలో, సంఘంలో వారు సూటిపోటి మాటలకు గురవుతున్న ఘటనలు ఎన్నో చూస్తున్నాం. అయితే.. ఈ తరం ఆడాళ్లు అందులో సినీ రంగం ప్రముఖులు అయితే వారి అందం దెబ్బతింటుందనో.. మరో కారణంగానో ప్రెగ్నెన్సీకి ఒప్పుకోవడం లేదు. వారు మరో పద్ధతిలో తల్లిదండ్రులు కావాలని ఆశపడుతున్నారు. కానీ, ఓ బిడ్డను కని, పాలిచ్చి పెంచకుండా మాతృత్వపు మాధుర్యం ఎట్లా తెలుస్తుంది? అని ప్రశ్నిస్తున్నారు చాలామంది.  అద్దె గర్భం (సరోగసి) ద్వారా బిడ్డలను కన్నంత మాత్రన నిజమైన తల్లిదండ్రులు అవుతారా? అన్న సీరియస్​ కామెంట్స్​ కూడా వస్తున్నాయి.

– ఇంటర్నెట్​ డెస్క్​, ఆంధ్రప్రభ

సరోగసి పద్ధతి ద్వారా తల్లిదండ్రులు అవుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. దీంట్లో ఎక్కువగా సినీ రంగానికి చెందిన  వారే ఉంటున్నారు. ఇట్లా చేస్తన్న వారిలో ప్రముఖ నటులు ఉండడం వల్ల ఇప్పుడీ అంశం చర్చల్లోకి వస్తోంది. అప్పటికే వారికి ఉండే బిజీ షెడ్యూల్స్​ వల్ల కానీ, గర్భందాల్చి, తల్లిగా మారితే మళ్లీ చాన్స్​లు రావేమో అనే కారణం వల్లనేమో కానీ.. చాలామంది  తల్లిగా మారడానికి అద్దె గర్భాలను ఆశ్రయిస్తున్నారు. ఇప్పటివరకు సరోగసీ ద్వారా తల్లి-తండ్రులుగా మారిన సెలబ్రిటీల జాబితా పెద్దగానే ఉంది. ఈ లిస్టులు.. బాలీవుడ్ నటిమణులు ప్రియాంక చోప్రా, శిల్పా శెట్టి, ప్రీతి జింటా, సన్ని లియోన్, షారూఖ్ ఖాన్ సతీమణి గౌరీఖాన్, అమీర్ ఖాన్ సతీమణి కిరణ్ రావు, ఏక్తా కపూర్, టాలీవుడ్ నటి, నిర్మాత మంచు లక్ష్మి తదితరులు ఉన్నారు. లేటెస్టుగా ఈ జాబితాలోకి అందాల తార నయనతార కూడా చేరింది.

నాలుగు నెలల క్రితం అంటే జూన్ 9న దర్శక నిర్మాత, నటుడు విఘ్నేశ్ శివన్ ను నయనతార పెళ్లాడింది. 2022 అక్టోబర్ 9న తాము సరోగసీ ద్వారా తల్లిడండ్రులుగా మారినట్లు వారు ట్విట్టర్​ ద్వారా గుడ్ న్యూస్ చెప్పారు. సరోగసీ ద్వారా పండంటి మగపిలల్లకు జన్మనిచ్చినట్టు తెలిపింది నయన్. ఈ విషయాన్ని ఇన్‏స్టా లో పోస్ట్ చేస్తూ.. తమ పిల్లలకు ఉయిర్ (Uyir) ఉలగమ్( Ulagam) అని పేర్లు పెట్టినట్లు తెలిపారు నయన్​ విఘ్నేశ్​ దంపతులు.

సరోగసీ అంటే ఏమిటి..?

- Advertisement -

సరోగసీ అంటే చాలామందికి తెలయకపోవచ్చు. ఆడాళ్లలో విడుదల అయ్యే అండాలను మరో మహిళ గర్భంలో ప్రవేశపెట్టి.. పురుషుల వీర్యంతో ఫలదీకరించడం ద్వారా అద్దె గర్భంలో తమ పిల్లలను కనొచ్చు. ఇట్లాంటి పద్ధతి ద్వారా అండాలను దాచుకోవచ్చు.. వారు కోరుకున్నప్పుడే తల్లి అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. అయితే సెలబ్రిటీలు, పెద్ద పెద్ద సంపన్నులు తమ అందాన్ని కాపాడుకోవడానికి, కెరియర్ ఎదుగుదలకు మాతృత్వం అడ్డు కాకూడదని అనుకునే వారు.. అంతేకాకుండా ప్రెగ్నెన్సీ రిస్క్‏ ఉన్నవారు .. దీర్ఘకాలికమైన వ్యాధులతో బాధపడేవారు.. ప్రీ-మెచ్యుర్ మెనోపాజ్ సమస్య ఉన్నవారు, కుటుంబ, వ్యక్తిగత కారణాలతో లేటుగా పిల్లలను కనాలని భావించేవారు  ఈ సరోగసీ ప్రక్రియను ఎంచుకుంటారు.

ఇటువంటివారికి సరోగసీ విధానం ఓ వరంగా మారిందనే చెప్పవచ్చు. ఎగ్‌ ఫ్రీజింగ్‌ టెక్నాలజీ వల్ల ఇది చాలా ఈజీ అవుతుందంటున్నారు డాక్టర్లు. సింగిల్ గా ఉన్న పురుషులు కూడా అండాన్ని దాతనుంచి స్వీకరించి ఐవీఎఫ్ ద్వారా తమ శుక్ర కణాలతో సంయోగపర్చి పిండాన్ని సర్రోగసీ (అద్దె గర్భం) తల్లి గర్భంలో ప్రవేశపెట్టి తండ్రిగా మారుతున్నారు. బాలీవుడ్ డైరెక్టర్ కరణ్ జోహర్ ఇదే పద్దతిలో తండ్రిగా మారారు.

ఈ ప్రక్రియ ఎలా జరుగుతుంది..

తల్లి కావాలనుకున్న మహిళ అండాన్ని మైనస్ 196 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద భద్రపరచడాన్ని ఫ్రీజింగ్ అంటారు.. ఫ్రీజ్ అయిన అండాలను మళ్లీ సాధారణ స్థితికి తీసుకురావడాన్ని థాయింగ్ అంటారు. ఇలా సాధారణ ఉష్ణోగ్రత స్థాయికి తీసుకువచ్చిన అండంలోకి భర్త వీర్యకణాన్ని చొప్పించి ప్రయోగశాలలో ఫలధీకరణ చేస్తారు. అలా ‘పిండం’ తయారవుతుంది. ఇలా తయారైన పిండాన్ని తాము ఎంపికచేసుకున్న మహిళ గర్భాశయం (అద్దె గర్భం) లోకి ప్రవేశపెడతారు.

ఆ దంపతుల పిండాన్ని గర్భంలో మోసి అభివృద్ధి అయిన అనంతరం సరోగసీ మదర్ సాధారణ డెలివరీ లేదా సిజేరియన్ ద్వారా ప్రసవిస్తుంది. డెలివరీ అనంతరం ఆ బిడ్డను తల్లిదండ్రులకు అప్పగిస్తారు. వీరి పిండాన్ని తొమ్మిది నెలలపాటు మోసిన మహిళకు వారు ముందే మాట్లాడుకున్న ప్రకారం కొంత డబ్బు అందిస్తారు. ఈ ప్రక్రియ అంతా డాక్టర్ల పర్యవేక్షణలో సాగుతుంది. ఈ ప్రక్రియ విజయవంతం అయ్యే అవకాశాలు 40 నుంచి 60 శాతం వరకూ ఉంటాయి. ఐవీఎఫ్, టెస్ట్ ట్యూబ్ బేబీ వంటి వాటిల్లో కూడా సక్సెస్‌ రేటు 60 లోపే ఉంటుంది. భారత్‏లో సరోగసీ గర్బాలు ( గర్భాన్ని మోసి అద్దె మహిళలు) అయ్యే ఖర్చు తక్కువగా ఉండటం..  ఇక్కడ మహిళల అవసరాలను ఆసరాగా చేసుకుని చాలామంది విదేశీయులు సరోగసీ కోసం ఇండియాకి తరలివస్తున్నారు.

పిల్లల ఉత్పత్తి కర్మాగారాలుగా మారుతున్న మహిళలు..

ఈ పద్దతిని అవలంభించడంలో ముందు వరుసలో భారత్, అమెరికా, థాయిలాండ్, ఉక్రెయిన్ ఉన్నాయి. 2012 నాటికే సరోగసీ మార్కెట్‏కు క్యాపిటల్‏గా భారత దేశం మారింది. ఏడాదికి సరోగసీ టూరిజం విలువ 500 మిలియన్ డాలర్లు ఉంటుందని ఓ అంచనా. సంతాన లేమితో బాధ పడుతున్న జంటలు చాలామంది అద్దె గర్భాలకోసం ఎక్కువగా ఉక్రెయిన్ బాట పడుతున్నారు. అద్దె గర్భాల(సర్రోగసీ) కు ప్రధాన కేంద్రంగా ఉక్రెయిన్ మారుతోందన్న విషయం ఇప్పుడిప్పుడే బయట ప్రపంచానికి తెలుస్తోంది.

అక్కడ సరోగసీ ద్వారా పిల్లలను కని రూ.40-42 లక్షలకు అమ్మకం చేస్తుంటారు. ఒక అధ్యయనం ప్రకారం ఉక్రెయిన్లో ఏటా 2500 నుంచి 3000వరకు అద్దె గర్భాల ద్వారా పిల్లలకు జన్మనిస్తున్నట్టు తెలుస్తోంది. ఉక్రెయిన్ లో ఇట్లాంటి విషయం ఓ పరిశ్రమ స్థాయికి చేరింది.  ప్రపంచంలో అద్దె గర్భాలను ఆమోదిస్తున్న అతి కొన్ని దేశాల్లో ఉక్రెయిన్ ఒకటి. ప్రపంచంలో అద్దెగర్భాలు ధరించడంలో ముందున్న దేశాల్లో అమెరికా, భారత్, థాయ్ లాండ్, ఉక్రెయిన్, రష్యా వంటి దేశాలున్నాయి.

ప్రపంచ వ్యాప్తంగా అద్దె గర్భాల మార్కెట్ విలువ 5 బిలియన్ యూరోలు(రూ.44,146 కోట్లు)గా ఉంది. ఉక్రెయిన్లో అద్దె గర్భం సగటు విలువ రూ.22 లక్షలు నుంచి రూ.61 లక్షల దాకా ఉంటుందని అంచనా.. అన్ని రకాల రోగసీని నిషేధించిన దేశాల్లో.. ఇటలీ, స్పెయిన్, పోర్చుగల్, బల్గేరియా దేశాలున్నాయి. ఇక.. యూకే, ఐర్లండ్, డెన్మార్క్, బెల్జియం, సరోగసీకి అనుమతి ఉన్నప్పటికీ ఈ దేశాల్లో అద్దె గర్భం మోసిన తల్లికి సాధారణ ఖర్చులు మినహా వ్యాపారాత్మక ధోరణితో డబ్బు చెల్లించడం నిషేధించారు. కమర్షియల్ సర్రోగసీ(వ్యాపారాత్మక అద్దెగర్భాలు) ఒప్పుకున్న దేశాల్లో భారత్(2002), రష్యా, ఉక్రెయిన్, అమెరికాలోని కొన్ని రాష్ట్రాలు మాత్రమే ఉన్నాయి.

భారత్ లో అద్దె గర్భం నియంత్రణ చట్టం అమలు..

2021లో అద్దె గర్భం నియంత్రణ చట్టం-2021 పేర దీన్ని పార్లమెంట్ ఆమోదించింది. ఈ చట్టంలో భాగంగా వితంతువులు, విడాకులు పొందిన వారు ఇతరులకు తమ గర్భాన్ని అద్దెకు ఇవ్వడానికి కేంద్రం ఆమోదించింది. ఇది వాణిజ్యపరమైన సరోగసీని నిషేధిస్తుంది. గర్భధారణ సమయంలో వైద్య ఖర్చులు, భీమా కవరేజీ మినహా అద్దె తల్లికి ఎలాంటి ద్రవ్య పరిహారాన్ని కలిగి ఉండని, పరోపకార సరోగసీని మాత్రమే అనుమతిస్తారు.

అనైతిక సరోగసీ నియంత్రణకు చట్టంలో కొన్ని నిబంధనలు విధించారు.. వాటిలో ముఖ్యమైనవి..

1. దంపతులిద్దరూ భారతీయులై ఉండాలి
2. వంధ్యత్వంతో బాధపడుతున్న జంటలు సరోగసీని స్వీకరించవచ్చు
3.అయితే జంటకు వివాహమై అయిదేళ్లు లేదా అంతకంటే ఎక్కువ కాలం పూర్తవ్వాలి.
4.ఇద్దరిలో ఒకరు వంధ్యత్వంకు గురైతే సరోగసీని ఎంచుకునేందుకు అనుమతి ఉంది.
5. పరోపకారం కోసం స్వీకరించవచ్చు
6.వాణిజ్య ప్రయోజనాల కోసం చేయరాదు
7. అమ్మకం, వ్యభిచారం లేదా ఇతర రకాల దోపిడీ కోసం పిల్లలను ఉత్పత్తి చేయడం చేయరాదు
8. నిబంధనలలో పేర్కొన్న ఏదైనా వ్యాధి, పరిస్థితుల్లో సరోగసీని స్వీకరించవచ్చు
9. భార్య వయసు 23 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి. భర్త వయసు 26 నుంచి 55 ఏళ్ల మధ్య ఉండాలి
10. సరోగసీ ప్రక్రియకు వెళుతున్న దంపతులకు.. తమకు పుట్టినవారైనా లేదా దత్తత తీసుకున్న పిల్లలు ఉండకూడదు.
11. మేజిస్ట్రేట్ కోర్టు నుంచి బిడ్డ పేరెంటింగ్, కస్టడీ ఆర్డర్ తీసుకోవాలి
12. అద్దె గర్భం మోసే తల్లికి 16 నెలల బీమా రక్షణ కల్పించాల్సింది ఆ దంపతులే.

అద్దె గర్భం మోసే తల్లికి నిబంధనలు..

1. అద్దె గర్భం మోసేందుకు అర్హత సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేయాలి
2. సరోగసీకి వెళుతున్నజంటకు ఆమె దగ్గరి బంధువై ఉండాలి
3. సరోగేట్ తల్లి వివాహితురాలై ఉండాలి
4. ఆమెకు కనీసం ఒక బిడ్డ అయినా ఉండాలి. ఆమె వయసు 25 నుంచి 30 ఏళ్లు ఉండాలి
5. మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉండాలి
6. ఒక మహిళ తన జీవితకాలంలో ఒకసారి మాత్రమే సరోగసీ ద్వారా బిడ్డను కనాలి

భారత్‏లో ఏటా దాదాపు 25వేల మంది పిల్లలు సరోగసీ ద్వారా జన్మిస్తున్నారని అంచనా. మెక్సికో, నేపాల్, పోలండ్, జార్జియాల్లో సైతం సరోగసీకి అనుమతి ఉన్నట్లు తెలుస్తోంది. వ్యాపారాత్మక సరోగసీ కోసం ఇతర దేశాలకు వెళ్లడాన్ని నిషేధించిన ఆస్ట్రేలియాలోని కొన్ని రాష్ట్రాలున్నాయి.

చైనాలో నిషేధం ఉండగా.. ఫ్రాన్స్, జర్మనీలో సరోగసీ చట్ట వ్యతిరేకమని వెల్లడైంది. అమెరికాలో  సరోగసీ నిబంధనలు వివిధ రాష్ట్రాల్లో వేరుగా ఉన్నాయి. అయితే చాలా రాష్ట్రాల్లో సరోగసీకి అనుమతి లేదు. ఈ పద్ధతిని కేవలం వైద్యపరమైన ప్రతిబంధకాలు ఉన్నవారికి మాత్రమే అనుమతి ఉంది. ఎగ్‌ ఫ్రీజింగ్‌ ప్రక్రియను ఇటీవలే బ్యాన్‌ చేసిన సింగపూర్‌. ఇక్కడ జననాలు రేటు 1.1 కనిష్ట స్థాయికి చేరడంతో బ్యాన్‌ చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement