Friday, May 10, 2024

మునుగోడు జన బలం.. ధన బలంకు మధ్యనే పోటీ … మంత్రి కేటీఆర్

అక్రమ కాంట్రాక్టులతో రాజగోపాల్ రెడ్డి సంపాదించిన ధన బలంకి, మునుగోడు ప్రజల జన బలంకు మధ్యనే ఈ పోటీ జరుగుతుందని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి తరుపున మునుగోడులో ప్రచారానికి వెళ్లిన నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి టెలి కాన్ఫరెన్స్ నిర్వహించిన కేటీఆర్, కాంట్రాక్టులతో రాజగోపాల్ రెడ్డి సంపాదించిన ధన బలంకి మునుగోడు ప్రజల జన బలంకి మధ్య జరుగుతున్న ఎన్నిక ఇదని కేటీఆర్ అన్నారు. వేలకోట్ల రూపాయల అక్రమ కాంట్రాక్టులతో సంపాదించిన ధనబలంతో జనాలను పట్టించుకోకుండా ఇన్నాళ్లుగా నియోజకవర్గాన్ని నిర్లక్ష్యం చేసిన వ్యక్తి ఈరోజు ఉప ఎన్నికల కోసం వచ్చారని కేటీఆర్ విమర్శించారు. రాజగోపాల్ రెడ్డి ధన దాహం, వేల కోట్ల రూపాయల ఆయన కాంట్రాక్టుల కోసమే వచ్చిన ఎన్నిక ఇదన్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకుపోవాలని మంత్రి కేటీఆర్ టీఆర్ఎస్ కార్యకర్తలను కోరారు.

ఈ నాలుగు సంవత్సరాల కాలంలో తాను ప్రాతినిథ్యం వహిస్తున్న మునుగోడు నియోజకవర్గాన్ని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పూర్తిగా నిర్లక్ష్యం చేశారన్న కేటీఆర్, ఆయన ఒక అట్టర్ ప్లాఫ్ ఎమ్మెల్యే అన్నారు. నియోజకవర్గ అభివృద్దిని, ప్రజల కష్ట సుఖాలను ఏమాత్రం పట్టించుకోకుండా కేవలం తన కాంట్రాక్టుల గురించి మాత్రమే ఆలోచించే ఫక్తు రాజకీయ వ్యాపారి రాజగోపాల్ రెడ్డి అని కేటీఆర్ విమర్శించారు. నియోజకవర్గ సమస్యలను వదిలేసి అసెంబ్లీలో కాంట్రాక్టర్ల బిల్లుల కోసం మాట్లాడిన ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అని కేటీఆర్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. వేల కోట్ల రూపాయల కాంట్రాక్టు కోసమే రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరారని కేటీఆర్ విమర్శించారు. రాజగోపాల్ రెడ్డి ధన దాహంతోనే ఈ ఉప ఎన్నిక మునుగోడు ప్రజల మీద బలవంతంగా రుద్దబడిందన్నారు. కేవలం ఎన్నికల్లో గెలవడం కోసం అనేక హామీలిచ్చి వాటిలో ఏ ఒక్కదాన్ని నెరవేర్చకుండా చేతులెత్తేసిన రాజగోపాల్ రెడ్డి ఈ ఉప ఎన్నిక సందర్భంగా మరోసారి ప్రజలను ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. బీజేపీ ఇచ్చిన వేల కోట్ల రూపాయల కాంట్రాక్టు కమీషన్ పైసలతో బైకులు, కార్లతో పాటు ఇతర విలువైన వస్తువులను ఓటర్లకు రాజగోపాల్ రెడ్డి పంచుతున్నారని కేటీఆర్ ఆరోపించారు. ఇంకో సంవత్సరం పాటు పదవి కాలం ఉన్నా, ఉప ఎన్నిక స్వార్థ ప్రయోజనాల కోసం ఎన్నిక తెచ్చారని, అయితే చైతన్యవంతులైన మునుగోడు ఓటర్లు బిజెపికి రాజగోపాల్ రెడ్డికి ఈ ఉప ఎన్నికలో బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని కేటీఆర్ చెప్పారు. ఒకవైపు బిజెపి రాజగోపాల్ రెడ్డి కాంట్రాక్టు వ్యవహారాన్ని ఆయన విఫలమైన విధానాన్ని ప్రజలకు వివరిస్తూనే టీఆర్ఎస్ పార్టీ గత ఎనిమిది సంవత్సరాలు రాష్ట్ర అభివృద్ధికి ప్రజల సంక్షేమానికి చేసిన కార్యక్రమాలను వివరించాలని ఈ సందర్భంగా కేటీఆర్ పార్టీ శ్రేణులకు సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement