Friday, April 26, 2024

దొంగ ఓట్లంటూ రోడ్లపై డ్రామాలు: రోజా

తిరుపతి ఉప ఎన్నికలలో ప్రతిపక్షాలు పెద్ద నాటకం ఆడాయని నగరి ఎమ్మెల్యే రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఎన్నికలప్పుడు లేని దొంగ ఓట్లు.. ఇప్పుడు తిరుపతి ఎన్నికలప్పుడే ఎలా వచ్చాయని ప్రశ్నించారు. ప్రతిపక్షాలు కావాలనే దొంగ ఓట్లంటూ రోడ్లెక్కి తప్పుడు ప్రచారం చేస్తున్నాయన్నారు. ఇలాంటి ప్రచారాలతో తమ పార్టీ ప్రతిష్ఠ ఏమాత్రం దిగజారదన్నారు. జిల్లా పెద్ద పెద్దిరెడ్డిపై కక్ష సాధింపులో భాగంగానే తప్పుడు ఆరోపణలు చేశారని రోజా మండిపడ్డారు. దొంగ ఓట్లని ప్రచారం చేస్తున్నప్పుడు.. పోలింగ్ బూతుల్లోనే దొంగ ఓటర్లను ఎందుకు పట్టుకోలేదని ప్రశ్నించారు. తిరుపతి ఉప ఎన్నికల్లో ఏపీ సీఎం జగన్ కొత్త సంప్రదాయానికి తెరదీశారని రోజా అన్నారు. ఒక్క రూపాయి పంచకుండా, ఎవరికీ మద్యం పంపిణీ చేయకుండా ప్రలోభాలు లేని ఎన్నికలు నిర్వహించారని ప్రశంసించారు. మెరుగైన పాలన, సంక్షేమ పథకాల ద్వారా ప్రజల మనసులను జగన్ గెలిచారని ఆమె కొనియాడారు. కరోనా బాధితులకు జగన్ ప్రభుత్వం మంచి చికిత్సలు అందిస్తోందని రోజా పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement