Friday, April 26, 2024

కరోనా వ్యాక్సిన్ తీసుకున్న తెలంగాణ గవర్నర్

తెలంగాణ గవర్నర్, పుదుచ్చేరి లెఫ్ట్‌నెంట్ గవర్నర్ తమిళసై సౌందర్ రాజన్ శుక్రవారం నాడు కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. మహిళల కోసం పుదుచ్చేరిలో ప్రత్యేకంగా కరోనా వ్యాక్సినేషన్ సెంటర్ ఏర్పాటైంది. లెఫ్ట్‌నెంట్ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ దీన్ని శుక్రవారం ప్రారంభించారు. పుదుచ్చేరిలోని రాజీవ్‌గాంధీ ఆసుపత్రిలో మహిళల కోసమే ఈ కేంద్రాన్ని ప్రారంభించిన ఆమె తొలి డోసు వ్యాక్సిన్ తీసుకున్నారు. ఒక మహిళగా, వైద్యురాలిగా, పుదుచ్చేరి ప్రథమ పౌరురాలిగా వ్యాక్సిన్ తీసుకోవడం గర్వంగా ఉందని, అర్హత కలిగిన ప్రతిఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలని పిలుపునిచ్చారు. కరోనా రహిత దేశంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం తన వంతు కృషి చేస్తున్నా.. పౌరులు కూడా తగిన సహకారం ఇవ్వాలని ఆమె కోరారు. భారత్‌లోనే తయారైన ‘కొవిషీల్డ్’ వ్యాక్సిన్‌ను తీసుకున్నానని, పరిశోధన మొదలు అభివృద్ధి, తయారీ, పంపిణీ వరకు మొత్తం మన దేశంలోనే జరగడం మొత్తం ప్రపంచానికే ఆదర్శమన్నారు. కరోనా వ్యాప్తి విస్తృతమవుతున్న నేపథ్యంలో ప్రజలు స్వచ్ఛందంగా నివారణ కోసం జాగ్రత్తలు పాటించాలని కోరారు. వ్యాక్సిన్ తీసుకుంటూనే వైరస్ వ్యాప్తి నివారణ కోసం బాధ్యతగా వ్యవహరించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement