Monday, April 29, 2024

కురవి ఆలయంలో మంత్రి స‌త్య‌వ‌తి రాథోడ్ పూజలు..

● వీరభద్ర స్వామి, భద్రకాళి అమ్మవార్ల దర్శనం..
● రాష్ట్రాన్ని సుభిక్షంగా ఉంచమని కోరుకున్నాను.
● ఆలయ అభివృద్ధికి సిఎం కేసిఆర్ స్వయంగా వచ్చి రూ.5 కోట్లు ఇచ్చారు.
● నాలుగేళ్లు అయింది తొందరగా పనులు చేయాలని ఈవోకు చెప్పాను.
● గిరిజనులకు పెద్ద ఎత్తున స్వయం ఉపాధి పథకాలు అమలు చేస్తున్నారు.
●బ్యాంకర్లతో సంబంధం లేకుండా ఆర్ధిక చేయుత పథకాలు.
●ఇక్కడి ప్రజలకు ఎక్కువ అవకాశాలు వచ్చేలా ఇక్కడే యూనిట్లు.

కురవి – ఈ రాష్ట్రాన్ని సుభిక్షంగా ఉంచాలని, తెలంగాణ ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం అహర్నిషలు కృషి చేస్తున్న సిఎం కేసిఆర్ మరింత ధృడంగా ఉండాలని, మరిన్ని సంక్షేమ ఫలాలు ఈ రాష్ట్ర ప్రజలకు అందించేలా ఆయనను దీవించాలని కురవి వీరభద్ర స్వామిని కోరుకున్నట్లు రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా, డోర్నకల్ నియోజకవర్గంలోని కురవి ఆలయంలో నేడు మంత్రి సత్యవతి రాథోడ్ వీరభద్ర స్వామి, భధ్రకాళి మాతను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. మంత్రికి ఆలయ కార్యనిర్వహణాధికారి అర్ఛకులు సాధర స్వాగతం పలికి, సన్మానించారు. అనంతరం మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ ఉద్యమ కాలంలో కేసిఆర్ తెలంగాణ రావాలని కురవి వీరభద్ర స్వామిని మొక్కుకుని తెలంగాణ వచ్చాక ముఖ్యమంత్రిగా వచ్చి వీరభద్రస్వామికి బంగారు మీసాలు, భద్రకాళి అమ్మవారికి ముక్కు పుడక సమర్పించి, ఆలయ అభివృద్ధికి 5 కోట్ల రూపాయల నిధులు ఇచ్చారన్నారు. అయితే నిధులు ఇచ్చి నాలుగేళ్లు అవుతున్నా పనులు జరుగుతున్నందున, తొందరగా ఈ పనులు పూర్తి చేయాలని ఈఓకు ఆదేశించామన్నారు.
ఇక్కడకు వచ్చినప్పుడు డోర్నకల్ ప్రజలకు సాగునీరు, తాగునీరు కోసం సిఎం కేసిఆర్ ఇచ్చిన హామీ కంటే ఎక్కువగానే ఈ ప్రాంతానికి అభివృద్ధి చేశారన్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా నేడు ఈ నియోజకవర్గ ప్రాంతంలో చెరువులు, కాలువలు నీటితో నిండికళకళలాడుతున్నాయన్నారు. ముఖ్యంగా గిరిజన యువతకు పెద్ద ఎత్తున స్వయం ఉపాధి పథకాలు అమలు చేస్తున్నారని చెప్పారు. ఆర్ధిక సహకార పథకాలు బ్యాంకర్లతో సంబంధం లేకుండా అమలు చేయాలని చూస్తున్నారు. ఈ ప్రాంతం నుంచి మంత్రిగా నేను ప్రాతినిధ్యం వహిస్తున్నందున ఈ ప్రాంత ప్రజలకు ఎక్కువ మేలు జరిగేలా ఈ ప్రాంతానికి ఎక్కువ యూనిట్లు తీసుకొస్తానని హామీ ఇచ్చారు. మంత్రితో పాటు స్థానిక జడ్పీటీసీ బండి వెంకట్ రెడ్డి, బయ్యారం పిఎసిఎస్ చైర్మన్ మూల మధుకర్ రెడ్డి, టిఆర్ఎస్ నేతలు వేణుగోపాల్ రెడ్డి, శ్రీరామ్ నాయక్, బోడ శ్రీను, సుందర్ నాయక్, అల్లూరి కిషోర్ వర్మ తదితర నేతలున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement