Wednesday, May 15, 2024

RCB : కింగ్ కోహ్లీ రికార్డుల సునామీ..

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఐపీఎల్‌లో అరుదైన రికార్డులు నెలకొల్పాడు. ఐపీఎల్‌ ఛేదనలో అత్యధిక సార్లు హాఫ్ సెంచరీలు చేసిన భారత ఆటగాడిగా నిలిచాడు. అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో విరాట్ (70 నాటౌట్; 44 బంతుల్లో 6×4, 3×6) అర్ధ శతకం చేయడంతో.. ఈ అరుదైన రికార్డును తన పేరుపై లిఖించుకున్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఛేదనలో విరాట్ 24 హాఫ్ సెంచరీలు బాదాడు.

- Advertisement -

అంతకుముందు ఐపీఎల్‌ ఛేదనలో అత్యధిక సార్లు హాఫ్ సెంచరీలు చేసిన భారత ఆటగాడి రికార్డు పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శిఖర్ ధావన్ పేరిట ఉంది. ఐపీఎల్ ఛేజింగ్‌లో గబ్బర్ 23 సార్లు 50కి పైగా స్కోరు చేశాడు. గుజరాత్ టైటాన్స్‌ మ్యాచ్‌తో ధావన్ రికార్డును విరాట్ కోహ్లీ బ్రేక్ చేశాడు. ఓవరాల్‌గా ఐపీఎల్ ఛేదనలో అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన రికార్డు ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ డేవిడ్ వార్నర్ పేరుపై ఉంది. వార్నర్ 35 సార్లు ఐపీఎల్ ఛేదనలో అర్ధ శతకాలు బాదాడు. ఈ జాబితాలో కేఎల్ రాహుల్ (22), గౌతమ్ గంభీర్ (20) టాప్ 5లో ఉన్నారు.

విరాట్ కోహ్లీ ఖాతాలో మరో రికార్డు కూడా చేరింది. ఐపీఎల్‌లో అత్యధిక సీజన్లలో 500లకు పైగా పరుగులు సాధించిన ఆటగాడిగా కోహ్లీ నిలిచాడు. 7 సీజన్లలో విరాట్ 500లకు పైగా పరుగులు చేశాడు. డేవిడ్ వార్నర్‌ కూడా 7 సీజన్లలో 500లకు పైగా రన్స్ బాదాడు. ఈ జాబితాలో శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్ సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నారు. ధావన్, రాహుల్ 5 సార్లు 500 మార్క్‌ను అందుకున్నారు. ఐపీఎల్ 2024లో ఇప్పటివరకు 10 మ్యాచ్‌లు ఆడిన కోహ్లీ.. 500 పరుగులు చేశాడు. ప్రస్తుతం ఆరెంజ్ క్యాప్‌ విరాట్ వద్దే ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement