Friday, April 26, 2024

తెలంగాణలో అటవీ పునరుద్ధరణ బావుంది.. రాష్ట్రంలో పర్యటించిన కేరళ అటవీశాఖ అధికారులు..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పచ్చదనం పెంపు, అటవీ పునరుద్ధరణ పనులు బాగున్నాయని కేరళ అటవీశాఖ అధికారులు కితాబిచ్చారు. తెలంగాణలో రెండు రోజుల పాటు పర్యటించిన కేరళ ఐఎఫ్‌ఎస్‌ అధికారులు కీర్తి, మహమ్మద్‌ షాబాద్‌ రాష్ట్రంలోని పచ్చదనం పెంపు కార్యక్రమాలను అధ్యయనం చేశారు. తెలంగాణకు హరితహారం, పట్టణ ప్రాంత అటవీ పార్కుల అభివృద్ధి,అటవీ పునరుద్ధరణ, అత్యున్నత ప్రమాణాలతో ఏర్పాటు చేసిన అటవీ కళాశాల, పరిశోధన సంస్థ చాలా బావున్నాయని కేరళ అధికారులు అన్నారు. సిద్ధిపేట జిల్లా ములుగు సెంట్రల్‌ నర్సరీతో పాటు, నర్సంపల్లి బ్లాక్‌లో అటవీ పునరుద్ధరణ, సింగాయపల్లిలో యాదాద్రి మోడల్‌ ప్లాంటేషన్‌, గజ్వేల్‌ పరిసరాల్లో అవెన్యూ ప్లాంటేషన్‌, కోమటిబండ మిషన్‌ భగీరథ ప్రాజెక్టు, పల్లె ప్రకృతివనం, అర్బన్‌ ఫారెస్టు పార్కులను రెండు రోజుల పాటు కేరళ అధికారులు పరిశీలించారు.

క్షీణించిన అటవీ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున మొక్కల నాటడం ద్వారా పరిరక్షించిన విధానం బావుందన్నారు. అటవీ అధికారులు, సిబ్బంది పనితీరుకు నిదర్శనంగా నిలుస్తోందని కేరళ అధికారులు అభినందించారు. ఔటర్‌రింగు రోడ్డు వెంట పచ్చదనం పెంపు అద్భుతంగా ఉందన్నారు. అత్యున్నత ప్రమాణాలతో నెలకొల్పిన ఫారెస్టు కాలేజీ – రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌ అటవీ విద్యను కొత్తపుంతలు తొక్కిస్తుందనే ఆశాభావం కేరళ బృందం వ్యక్తం చేశారు. కేరళ అధికారులు పర్యటనలో ముఖ్యమంత్రి ఓఎస్డీ ప్రియంక వర్గీస్‌, మెదక్‌ చీఫ్‌ కన్జర్వేటర్‌ శవరనన్‌, సిద్ధిపేట జిల్లా అటవీ అధికారి శ్రీధర్‌, ఇతర అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement