Saturday, April 20, 2024

తెలంగాణ‌లో ఉద్యమ స్ఫూర్తితో కొనసాగుతోన్న హరితహారం.. నాలుగేళ్ళలో 7.7 పెరిగిన పచ్చదనం..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రభుత్వం సాధించిన పథకాల్లో తెలంగాణకు హరితహారం పథకం అనుకున్నదానికంటే అధికంగా పురోగతి సాధిస్తున్నట్లు శనివారం విడుదల చేసిన ప్రకటనలో ప్రభుత్వం తెలిపింది. రోజు రోజుకూ హరించుకోపోతున్న అడవి, పెరుగుతున్న కాంక్రీట్‌ జంగల్‌, పెరుగుతున్న జనాభా వలన వాహన, పరిశ్రమల వ్యర్థ కాలుష్యాల పట్ల జీవారణం అంతా అస్తవ్యస్థమైందని పేర్కొంది. భూభాగంలో కనీసం 33 శాతం ఉండాల్సిన అడవి అంతరించిపోయే పరిస్థితి దాపురించిందని తెలిపింది. దీంతో భూమిపై మొత్తం జీవన ప్రమాణాలే తగ్గిపోయి, అనారోగ్యాలు, అనేక సమస్యలు తలెత్తుతున్నట్లు వెల్లడించింది. ఈ పరిస్థితుల్లో సిఎం కేసీఆర్‌ ప్రపంచంలోనే మూడో అతి పెద్ద కార్యక్రమంగా హరితహారం కార్యక్రమాన్ని అమలులోకి తెచ్చారు. మొక్కలని నాటి, వాటిని సంరక్షించి, అడవుల శాతాన్ని పెంచడమే లక్ష్యంగా ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. కేసీఆర్‌ ప్రవేశపెట్టిన హరితహారం స్ఫూర్తితో గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ లాంటి కార్యక్రమాలు కూడా ఉద్యమంలా కొనసాగుతున్నాయి. భూమిపై పచ్చదనాన్ని పెంచేందుకు చైనా, బ్రెజెల్‌ తర్వాత జరుగుతున్న మూడవ మానవ మహా ప్రయత్నం తెలంగాణకు హరితహారంగా ప్రభుత్వం వెల్లడించింది. తెలంగాణలో పచ్చదాన్ని 33 శాతానికి పెంచేందుకు ప్రభుత్వం హరితహారం కార్యక్రమాన్ని ఉద్యమ స్ఫూర్తితో అమలు చేస్తోంది. గత ఎనిమిదేళ్లలో 8,511 కోట్ల వ్యయంతో 243 మొక్కలను నాటినట్లు అధికారుల నివేదికలు వెల్లడించాయి.

తొమ్మిది లక్షల 65 వేల ఎకరాల అడవుల పునరుద్ధరణ జరిగినట్లు తెలిపారు. నగరాలు, పట్టణాల్లో 109 అర్బన్‌ ఫారెస్టులు అభివృద్ధి చేసినట్లు, అలాగే గత నాలుగేళ్ళలో తెలంగాణలో 7.7 గ్రీన్‌ కవర్‌ పెరిగినట్లు ఫారెస్టు సర్వే ఆఫ్‌ ఇండియా పేర్కొంది. ప్రపంచంలో ఎక్కడలేని విధంగా అన్ని వర్గాల భాగస్వామ్యంతో గ్రీన్‌ బడ్జెట్‌ను తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. నగర పాలక సంస్థలు, స్థానిక సంస్థలలో కూడా ప్రత్యేకంగా 10 శాతం గ్రీన్‌ బడ్జెట్‌ను కేటాయించి, ఖర్చు చేస్తున్నారు. రాష్ట్రంలోని 12,769 గ్రామ పంచాయతీలు, ఇతర ప్రతి గ్రామంలోనూ మొక్కలను పెంచేందుకు నర్సరీలను ఏర్పాటు చేశారు. ప్రతి ఏటా వర్షాకాలానికి ముందే హరితహారం కార్యక్రమాన్ని ఒక ఉద్యమంలా నిర్వహిస్తున్నారు. ఇతర అన్ని అధికారిక సందర్భాల్లోనూ ప్రజా ప్రతినిధులు, అధికారులు, ప్రముఖులు మొక్కలు నాటుతున్నారు. పుట్టిన రోజున కూడా మొక్కలు నాటే సంప్రదాయం తెలంగాణలో కొనసాగుతుంది. మొక్కలు నాటడమే కాదు, వాటిని సంరక్షించే బాధ్యతను స్థానిక సంస్థలు, ప్రజలు, ప్రజాప్రతినిధులు ఎవరికి వారే తీసుకుంటున్నారు. గ్రామ పంచాయతీలకు ట్రాక్టర్లు, ట్రాలీలు, ట్యాంకర్లను సమకూర్చడం వలన అవి మొక్కల సంరక్షణకు కూడా ఉపయోగపడనున్నాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement