Monday, May 13, 2024

తత్వ రహస్యం తెలిపేది…భక్తి మార్గమే!

”మయ్యావేశ్య మనోయేమాం
నిత్యయుక్తా ఉపాసతే
శ్రద్దయా పరయోపేతా:
తేమేయుక్త తమా మతా:”
జనులకు సుఖదు:ఖాలు జన్మతోటే కలుగుతుంటాయి. అవి తొలగి నిశ్శ్రేయసా న్ని పొందగోరిన వారు ఆధ్యాత్మ యోగాన్ని ఆశ్రయించాలి. మనుష్యులలో ‘మన స్సు’ అనే అంత:కరణం ఒకటుంది. బంధమోక్షాలకు కారణం అదే బంధం అంటే మనస్సును ఒక దానియందు లగ్నం చేసి ఉంచడం. ఈ బంధం మనస్సును ఒక దాని యందు లగ్నం చేసి ఉంచదు. ఈ బంధం మనస్సును సత్వరజస్తమోగుణాలకు అం కితం చేసినప్పుడు కలుగుతోంది. బంధాలలో చిక్కిన జీవికి ఆ బంధాల నుండి వెలు వడితే కాని ముక్తి కలుగదు. మనస్సు గుణాతీతమైన పరమేశ్వర భక్తికి పరమైనపుడు మోక్షం కలుగుతోంది.
శరీరం అన్నది ఆత్మకు ఒక తొడుగు వంటిది. ఈ సత్యాన్ని గ్రహించలేక శరీరమే ఆత్మ అని పొరబడుతుంటారు. అలాగే భార్యాబిడ్డలు, సిరి, సంపదలు ఎల్లకాలం ఉం డేవి కావని అందరికి తెలుసు అయినా అవి తమవలనే సుస్థిరంగా ఉంటాయని నమ్మి వాటివలన కలిగే తాత్కాలిక సుఖమే పరమ సుఖం అనుకుంటారు.
ఈ రెండు భావాలనూ ‘అభిమానాలు’ అంటారు. వీటిలో ఒకసారి తగులుకొం టే అవి నానాటికి వృద్ధి చెంది ‘కామం’గా మారిపోతుంది. ఆ కామకార్యం ఏమిటంటే తానొక్కడే అనుభవించాలన్న కోరిక కలిగిస్తుంది. అట్లాంటి భావనను ‘లోభం’ అం టారు. కామ, లోభాలు మనస్సును మలరూపంలో ఆవరిస్తాయి. కామ, లోభాలు ఉన్నంత కాలం సుఖదు:ఖాలు వదలవు. ఆ మలినాలు రెండు కడిగేస్తే మనస్సు పరిశు ద్ధమౌతుంది. మన: పరిశుద్ధి పొందాక మనస్సుకు సమవృత్తి కలుగుతోంది. దానితో హితాహితా జ్ఞానం ఉదయిస్తుంది. మనస్సుకు హితాహిత జ్ఞానం ఎప్పుడు కలుగు తుందో అప్పుడే హితత కార్యాలు చేయాలన్న సద్బుద్ధి విజృంభిస్తుంది. అణిత కార్యా ల పట్ల వైరాగ్యం పెంపొందుతోంది. హితబుద్ధి కార్యం ఏమిటంటే అది తనకు పరమా శ్రయ ఏదో దానిని వెదుకుతుంది. అప్పడు భగవంతుడు ఆ బుద్ధిని తన వంకకు మర లించి కొద్దిగా రుచిని కలిగిస్తాడు. అలా చవిగొన్న వస్తువును ప్రేమించి బుద్ధి దానిని సాధించాలని ప్రయత్నిస్తుంది. ఆ ప్రేమను భక్తి అని, ఆ సాధన యత్నాన్ని శ్రద్ధ అని పేర్కొంటారు.
శ్రద్ధాభక్తుల ఫలంగా పరమ ప్రేమాస్పదమైన వస్తుతత్వం క్రమకమంగా తేటప డుతుంది. ఆ వస్తువు నిరంతరం జ్యోతి: స్వరూపమై ఏకమై ఎటువంటి పరిచ్ఛేదాలు లేక తనలోనూ, సర్వభూతాలలోనూ ఏకరీతిగా వెలుగొందుతున్నదని ఆ వస్తువు ఆశ్రయించి ప్రకృతి ఉన్నదని తెలియవస్తుంది. ఈ మార్గాన్ని భక్తి మార్గం అంటారు. భక్తి మార్గాన్ని అవలంబించిన వారి వర్తనలు ఎలా ఉంటాయి.
”భక్తులైన వారు సర్వేంద్రియ వ్యాపారాలను భగవంతుని సేవ యందు విని యోగిస్తారు. వారు భగవంతుని కథలను తప్ప వృథా ప్రసంగాలను వినరు, పల్కరు వారి కన్నులు భగవానుని దివ్య స్వరూపాన్ని తప్ప అన్యాకృతులు ఇచ్చగించవు, చూడవు. భగవంతుని తోడిదే వారికి జీవిత సాఫల్యంగా ఉంటుంది. వారు చివరకు మోక్షాన్ని కూడా ఆశించరు. అట్టి వారికి ముక్తి లేదా? అని శంకింపవద్దు ముక్తిని వారు కోరకపోయినా స్వయంగా దానిని భగవానుడు వారికి ప్రసాదిస్తాడు. తత్ఫలంగా వారు భగవానుని చేరుకుంటారు.” ఏ తీరునైనా భగవానుని ఆశ్రయించిన వారికి కాల చక్రం బాధింపనేరదు. ఇహపరాలు రెండూ తృణీకరించి భార్యాపుత్ర పశుగృహాది సర్వస్వం త్యజించి భగవానుని విశ్వతోముఖాన్ని అనన్య భక్తి యోగంతో కొందరు ఆరాధిస్తారు. వారికి సంసార తరణం తప్పక కలుగుతుంది.
భయాలన్నింటిలో ‘మృత్యుభయం’ చాలా భయంకరమైనది. మృత్యుభయాని కి లోకమంతా వెరచి తల్లడిల్లుతుంది. భగవానుడు తప్ప అన్యులెవరూ ఆ భయాన్ని తీర్పలేరు. భగవానుని భక్తులను చూచి మృత్యువే భయపడి పారిపోతుంది. కనుక భక్తి యోగాన్ని ఆశ్రయించి భగవంతునిలో చిత్తాన్ని చేర్చినందున పరమ పురుషోత్త మ ప్రాప్తి తప్పక లభిస్తోంది.
మృత్యువంటే దేహ పతనమని భావిస్తారు. దేహం ఎప్పుడో ఒకప్పుడు రాలిపో తుంది. అది దాని స్వభావం. దానిని తప్పించడం సాధ్యంకాదు అయితే నిజానికి అది మృత్యువు కాదు. మృత్యువంటే ఆత్మనాశనమే! నిజమైన మృత్యువుకి అట్టి మృత్యు వు సంభవించినపుడు మళ్ళీ జనన మరణాలుండవు. అవి లేకపోవడమే మృత్యుభ య నాశనం. అట్టివారు భగవానుని చేరి సర్వకాలం సుఖాతిశయాన్ని చూరగొంటారు.
ఆ ప్రసాద ఫలంగా జీవుడు ప్రకృతి లీలను గ్రహించి వాటికి లోబడక అతీతుడై ఉంటాడు. అలా ఉండటం ప్రకృతి విజయం అంటారు. ప్రకృతిని జయించినవాడు బ్రహ్మత్వ సంపన్నుడౌతాడు. అనగా పరమాత్మ ప్రసాద ఫలంగా తత్పూర్వం కన్ను లను కప్పి ఉంచిన భ్రాంతి రూప అజ్ఞానం నశించిపోతుంది. అప్పుడు సర్వమూ స్వస్వరూపమని బోధపడుతుంది.
జీవులు పూర్వజన్మలలో ఎన్నో కర్మలు చేసి ఉంటారు. ఆ కర్మల ఫలాలు వివిధ రూపాలలో వివిధ గతులలో ఉంటాయి. వాటిలో కొన్ని ఒక్కొక్క రాశికి సంబంధించి ఉంటాయి. అలా రాసుల రాసులుగా ఏర్పడిన కర్మఫలాలను అనుభవించడానికి తగి న దేహం కలుగుతుంటుంది. అలా ఫలాను భోగానికి యోగ్యమైన కర్మను ప్రారబ్ద కర్మ అంటారు. ప్రారబ్ద కర్మలతో ఆ వాసనలు జీవిని వెన్నంటి ఉంటాయి. ఆ వాసనా సముచ్చయాన్ని స్వభావం అంటారు. కర్మఫలం భుక్తం కాగానే నశించిపోతుంది. కర్మఫల వాసనలు మిగిలి ఉండి వాటి సమయం వచ్చినప్పుడు రేగి తద్వాసనాను రూపమైన భావాలను కలిగించి తద్వివిధ కర్మలను ప్రేరేపించి జీవులచే ఆ కర్మలను ఆచరింపజేస్తాయి. కాలం పరబ్రహ్మ స్వరూపం. అది సర్వభూతాలలో ప్రవేశించి నిఖిలానికి ఆశ్ర యమై ఉంటుంది. కాలం ఆవిధంగా భూతాలలో ఉండి భూతముల చేత భూతముల ను హరింపజేస్తుంది. కాలానికి ప్రియాప్రియాలు స్వపరభేదం మరే ఇతర భేదాలు లేవు అది సమస్త జీవరావికి అంతకారకమైన మహాశక్తి.
జనులు సుఖంగా ఉండగోరి అందుకోసం నానా వస్తువులను ఎంతో శ్రమకోర్చి సమకూర్చుకుంటారు. ఆ వస్తువులన్నీ కాలప్రభావం చేత క్షణంలో చూస్తుండగానే నశించిపోతాయి. ఎల్ల వస్తువులూ మనకు లభించినట్లే లభించి మనకు అందకుండా మాయమైపోవడంతో లాభనష్టాలన్నీ కాలవశమని గ్రహింపని కారణాన వారు ఆవిధంగా శోకార్తులౌతున్నారు. జీవులు భక్తి యోగాన్ని ఆశ్రయించి నిత్య సమూహి తులు, నిస్సంగులు, విరక్తులు అయితే వారిలోని శక్తి కేంద్రీకరిస్తుంది అప్పుడే వారికి తత్వరహస్యం తెలుస్తుంది.
”యేతు ధర్మ్యామృతమిదం యధోక్తం పర్యుపాసతే
శ్రద్ధధానా మత్పరమా: భక్తాస్తే తీవమేప్రియా:”

Advertisement

తాజా వార్తలు

Advertisement