Monday, April 29, 2024

టిడిపి మాస్టర్ ప్లాన్… వాలంటీర్లకు చెక్!

ఏపీలో తిరుపతి ఉపఎన్నిక సందడి మొదలైంది. నామినేషన్ల ఘట్టం కొనసాగుతోంది. గెలుపుపై పార్టీల వ్యూహాలు పదునెక్కుతున్నాయి. అయితే పంచాయతీ, పురపోరు తర్వాత టీడీపీకి ఒక విషయంలో టెన్షన్‌ పట్టుకుందట. ప్రభుత్వం చేతిలో ఉన్న వాలంటీర్ల వ్యవస్థ ఎన్నికలను తీవ్రంగా  ప్రభావం చూపుతున్నట్టు టీడీపీ నమ్ముతోంది. ముఖ్యంగా విశాఖ మున్సిపల్‌ ఎన్నికల్లో మధ్యాహ్నం వ‌ర‌కు త‌మ‌కు అనుకూలంగా పోలింగ్ జ‌రిగిందని.. వాలంటీర్ల ప్రవేశంతో పరిస్థితి మారిపోయిందని గ్రహించారట. ఓటింగ్‌కు దూరంగా ఉన్న వారిని వెతికి మ‌రీ వాలంటీర్లు పోలింగ్‌ బూత్‌ దగ్గరకు తీసుకురావడం ద్వారా అధికార పార్టీకి లబ్ధి జరిగిందని టీడీపీలో చర్చ జరుగుతోంది. అందుకే  తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికలో వాలంటీర్ల ప్రభావంపై ఒక అంచనాకు వచ్చారట టీడీపీ నేతలు. కౌంటర్‌ ప్లాన్‌ సిద్ధం చేసినట్టు సమాచారం. 

రాష్ట్రంలో ప్రతి 50 కుటుంబాలు కవర్‌ అయ్యేలా వాలంటీర్ల వ్యవస్థ ఉంది. ప్రభుత్వ పథకాల నుంచి అన్ని వ్యవహారాలు వారే చక్కబెడుతున్నారు. గ్రామస్థాయిలో మంచి పట్టు సాధించారు. పథకాల లబ్ధిదారులు, ఇతర వర్గాలు అధికార పార్టీకి ఓటేసేలా ఈ వ్యవస్థ గట్టిగా పనిచేస్తున్నట్టు టీడీపీ నమ్ముతోంది. వైజాగ్‌లో జరిగింది.. తిరుపతిలో రిపీట్‌ కాకూడదని భావిస్తోన్న తెలుగుదేశం.. లోక్‌సభ పరిధిలో ప్రతి 50 కుటుంబాలకు ఒక పార్టీ కార్యకర్తకు బాధ్యత అప్పగించబోతున్నట్టు సమాచారం. వాలంటీర్లపై ఎన్నికల వేళ కన్నేయడంతోపాటు.. తమ పరిధిలో ఉన్న కుటుంబాలను ఓటింగ్‌కు వచ్చేలా చేయడం కార్యకర్తల బాధ్యతగా చెబుతున్నారు.

ఏప్రిల్ 17 న తిరుపతి ఉప ఎన్నిక జరగనుంది. టిడిపి తరపున మాజీ కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి బరిలో ఉన్నారు. వైసిపి నుంచి డాక్టర్ గురుమూర్తి, బిజెపి తరఫున రత్నప్రభ, కాంగ్రెస్ నుంచి చింతా మోహన్ పోటీలో ఉన్నారు. ఈ ఉప ఎన్నికను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement