ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. అధికార ప్రతిపక్ష పార్టీలు నువ్వా నేనా అనే విధంగా విమర్శలు ప్రతి విమర్శలు వ్యూహలు,ప్రతివ్యూహాలతో ముందుకు వెళ్తున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి రాగానే వాలంటీర్ వ్యవస్థను పెట్టిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ వాలంటీర్ వ్యవస్థను టిడిపి కూడా ఏర్పాటు చేసుకుంటుంది. ప్రభుత్వం చేతిలో ఉన్న వాలంటీర్లు ఎన్నికలపై తీవ్రంగా ప్రభావం చూపుతున్నట్టు టిడిపి నమ్మడమే ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే తిరుపతి లోక్సభ ఉపఎన్నికలో టీడీపీ కొత్త ప్రయోగంకు శ్రీకారం చుట్టింది.
ప్రభుత్వ వాలంటీర్లకు కౌంటర్గా సొంత టీమ్ నే ఏర్పాటు చేస్తుంది. ఇప్పటికే తిరుపతి ఉపఎన్నిక సందడి మొదలైంది. నామినేషన్ల ఘట్టం కొనసాగుతోంది. అయితే గతంలో ముఖ్యంగా విశాఖ మున్సిపల్ ఎన్నికల్లో మధ్యాహ్నం వరకు తమకు అనుకూలంగా పోలింగ్ జరిగినప్పటికీ వాలంటీర్ల ప్రవేశంతో పరిస్థితి మారిపోయిందని టీడీపీ గ్రహించారట. ఓటింగ్కు దూరంగా ఉన్న వారిని వెతికి మరీ వాలంటీర్లు పోలింగ్ బూత్ దగ్గరకు తీసుకురావడం ద్వారా అధికార పార్టీకి లబ్ధి జరిగిందని టీడీపీలో చర్చ జరుగుతోందని తెలుస్తోంది. అందుకే తిరుపతి లోక్సభ ఉపఎన్నికలో వాలంటీర్ల ప్రభావంపై ఒక అంచనాకు వచ్చారట టీడీపీ నేతలు.
50 కుటుంబాలకు ఒక టీడీపీ కార్యకర్త…
రాష్ట్రంలో ప్రస్తుతం ప్రభుత్వ పథకాల నుంచి అన్ని వ్యవహారాలు ప్రస్తుతం వాలంటీర్స్ చూసుకుంటున్నారు. గ్రామస్థాయిలో మంచి పట్టు సాధించారు. పథకాల లబ్ధిదారులు, ఇతర వర్గాలు అధికార పార్టీకి ఓటేసేలా ఈ వ్యవస్థ గట్టిగా పనిచేస్తున్నట్టు టీడీపీ నమ్ముతోంది. వైజాగ్లో జరిగింది.. తిరుపతిలో రిపీట్ కాకూడదని భావిస్తోన్న తెలుగుదేశం లోక్సభ పరిధిలో ప్రతి 50 కుటుంబాలకు ఒక పార్టీ కార్యకర్తకు బాధ్యత అప్పగించబోతున్నట్టు సమాచారం. వాలంటీర్లపై ఎన్నికల వేళ కన్నేయడంతోపాటు.. తమ పరిధిలో ఉన్న కుటుంబాలను ఓటింగ్కు వచ్చేలా చేయడం కార్యకర్తల బాధ్యతగా టీడీపీ సన్నాహాలు చేస్తుందట.