Wednesday, May 8, 2024

Nagarjuna Sagar Dam: డ్యామ్ పై డ్రామా… ఎలక్షన్ స్టంటే…!

ఏపీ తెలంగాణల మధ్య మరోసారి నీటి పేరుతో వివాదం రేగింది. అర్థరాత్రి నుంచి నాగార్జునసాగర్‌ దగ్గర ఉద్రిక్తత వాతావరణం కనిపిస్తోంది. ఏపీ పోలీసులు బుధవారం అర్ధరాత్రి డ్యామ్ దగ్గర ముళ్ల కంచెను ఏర్పాటు చేశారు. ప్రాజెక్టు 26 గేట్లలో సగ భాగమైన 13వ గేట్‌ వరకు తమ పరిధిలోకి వస్తుందని ఏపీ పోలీసు శాఖకు చెందిన ఉన్నతాధికారులు సుమారు 500 మంది పోలీసు సిబ్బందితో సాగర్‌ ప్రాజెక్టు దగ్గరకు వచ్చారు.

నీళ్ల విడుదలపై ఈ వివాదం మొదలైనట్లు చెబుతున్నారు. ఏపీ పోలీసుల్ని డ్యామ్‌ ఎస్పీఎఫ్‌ సిబ్బంది అడ్డుకోగా.. వారిపై దాడి చేసి మొబైల్‌ ఫోన్లను, డ్యామ్‌ భద్రత కోసం ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ఏపీ పోలీసులు ధ్వంసం చేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అనంతరం వారు 13వ గేట్‌ దగ్గరకు చేరుకొని ముళ్ల కంచెను ఏర్పాటు చేసి డ్యామ్‌ను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఏపీ పోలీసులు డ్యామ్ దగ్గరకు వచ్చారని సమాచారం అందుకున్న మిర్యాలగూడ డీఎస్పీ వెంకటగిరి డ్యామ్‌పైకి చేరుకొని ఏపీ పోలీసులతో మాట్లాడారు. డ్యామ్‌కు సంబంధించి నిర్వహణ విషయం నీటి పారుదలకు సంబంధించినదని.. ముళ్లకంచెను తీసేయాలని ఏపీ పోలీసులకు సూచించారు. కానీ వారు స్పందించకపోవడంతో తన సిబ్బందితో ఆయన వెనుదిరిగి వెళ్లారు. తెలంగాణ రాష్ట్ర విభజనలో భాగంగా నాగార్జున సాగర్ నిర్వహణను కృష్ణా రివర్‌ మేనేజ్‌మెంట్‌ బోర్డు తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించింది. ఇప్పటి వరకు నీటి విడుదల, భద్రతా విషయంలో తెలంగాణ ప్రభుత్వం అన్ని రకాల చర్యలను తీసుకుంది. గతంలో కూడా ఏపీ, తెలంగాణ పోలీసుల మధ్య నీటి విషయంలో వివాదంరేగింది. ఆ తర్వాత పరిస్థితి సద్దుమణిగింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement