యూపీఐ లావాదేవీల విషయంలో ప్రముఖ ఫిన్టెక్ సంస్థ పేటీఎం ఢీలా పడింది. ఈ యాప్ వేదికంగా యూపీఐ లావాదేవీలు వరుసగా మూడో నెలలోనూ క్షీణించాయి. ఏప్రిల్ నెలలో ఎన్పీసీఐ విడుదల చేసిన వివరాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. పేటీఎం వేదికగా మార్చిలో 1230.04 మిలియన్ల లావాదేవీలు జరిగాయి. ఏప్రిల్లో 9 శాతం క్షీణించి 1117.13 మిలియన్ల లావాదేవీలు నమోదుయ్యాయి.
మొత్తం యూపీఐ లావాదేవీల్లో పేటీఎం వాటా 8.4 శాతానికి పడిపోయింది. ఫిబ్రవరిలో ఇది 10.8 శాతం, మార్చిలో 9.13 శాతంగా ఉంది. యూపీఐ లావాదేవీల్లో ఫోన్ పే, గూగుల్ పే హవా కొనసాగుతోంది. ఫోన్పే ద్వారా 6500 మిలియన్ల లావాదేవీలు జరిగాయి. మొత్తం యూపీఐ లావాదేవీల్లో ఫోన్పే 48.8 శాతం మార్కెట్ వాటాలో అగ్రస్థానంలో ఉంది.
గూగుల్ పే 5,027.3 మిలియన్ల లావాదేవీలు, 37.8 శాతం మార్కెట్ వాటాలో రెండో స్థానంలో ఉంది. మార్కెట్లో పెద్దగా ఇతర పేమెంట్ యాప్లు లేకపోవడంతో పేటీఎం మూడో స్థానంలో ఉంది. క్రెడిట్ కార్డు బిల్లుల చెల్లింపుల కోసం ఉపయోగించే క్రెడ్ యాప్ నాలుగో స్థానంలో ఉంది. ఏప్రిల్లో 138.46 మిలియన్ల లావాదేవీలు ఈ యాప్ ద్వారా జరిగాయి.
పేటిఎం లావాదేవీలతో పోల్చితే ఇది నాలుగో వంతు మాత్రమే. మొదటి నుంచీ యపీఐ చెల్లింపుల విషయంలో ఫోన్పే, గూగుల్ పే ఆధిపత్యంలో ఉన్నాయి. పేటీఎం మూడో స్థానంలో ఉన్నప్పటికీ లావాదేవీల సంఖ్య పరంగా, మార్కెట్ వాటా పరంగా మెరుగైన స్థానంలో ఉండేది.
పేటీఎంపై ఆర్బీపై ఆంక్షల తరువాత మార్కెట్ వాటాను కోల్పోతూ వస్తోంది . ప్రస్తుతం పేటీఎం థర్డ్ పార్టీ అప్లికేషన్ ప్రొవైడర్గా వ్యవహరిస్తోంది. ఎస్బీఐ, యాక్సిస్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, యెస్ బ్యాంక్లు పేటీఎం పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్ బ్యాంక్లుగా వ్యవహరిస్తున్నాయి.