జెద్దా (సౌదీ అరేబియా): సౌదీ స్మాష్-2024 టేబుల్ టెన్నిస్ టోర్నీలో భారత జోడీలకు షాక్ తగిలింది. మహిళల డబుల్స్లో ఆసియా గేమ్స్ కాంస్య పతక విజేతలు అహికా ముఖర్జీ-సుతిర్థ ముఖర్జీ, పురుషుల డబుల్స్లో మానుశ్ షా-మానవ్ టక్కర్, మిక్స్డ్ డబుల్స్లో హర్మీత్ దేశాయ్-యశస్విని జోడీలు ఓటమిలతో ఇంటిబాట పట్టారు.
మంగళవారం ఇక్కడ జరిగిన మిక్స్డ్ డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో భారత స్టార్ జంట హర్మీత్ దేశాయ్-యశస్విని ఘోర్పడే 0-3 (6-11, 10-12, 4-11) తేడాతో టాప్ సీడ్ చైనా జోడీ వాంగ్ చుకిన్-సున్ యింగ్షా చేతిలో వరుస గేముల్లో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించారు. అంతకముందు జరిగిన ప్రి క్వార్టర్స్లో వీరు ఐదో సడీ స్పనీష్ జంటపై విజయం సాధించి సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.
ఇక మహిళల డబుల్స్ ప్రీ క్వార్టర్స్ పోటీల్లో భారత స్టార్ సిస్టర్స్ జోడీ అహికా ముఖర్జీ-సుతిర్థ ముఖర్జీ 2-3 (11-6, 9-11, 12-10, 6-11, 8-11) తేడాతో నాగసకి-నయెయంగ్ (జపాన్) జంట చేతిలో పోరాడి ఓడారు.
పురుషుల డబుల్స్ ప్రీ క్వార్టర్ ఫైనల్లో మానుశ్ షా-మానవ్ టక్కర్లు 2-3 (20-18, 4-11, 6-11, 11-9, 7-11)తో పిష్టెజ్ లుబొమిర్-చాన్ బాల్డ్విన్ (హాంకాంగ్) జంట చేతిలో పరాజయాన్ని ఎదుర్కొని టోర్నీ నుంచి వైదొలిగారు.