Monday, May 6, 2024

సీఎం కేసీఆర్ మాట త‌ప్ప‌డు… మ‌డ‌మ తిప్ప‌డు : మంత్రి ఎర్ర‌బెల్లి

సీఎం కేసీఆర్ అంద‌రి బంధువు… సబ్బండ వ‌ర్గాల‌కు సాయంగా ఉన్నార‌ని, అన్ని కులాలు, మ‌తాలు, వ‌ర్గాలు, ప్ర‌జ‌లు, ప్రాంతాల‌కు అతీతంగా అంద‌రి కోసం సీఎం ప‌ని చేస్తున్నార‌ని రాష్ట్ర పంచాయ‌తీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌రాశాఖ‌ల మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు అన్నారు. సీఎం కేసీఆర్ చెప్పిన‌ట్లు త్వ‌ర‌లోనే గిరిజ‌నుల‌కు 10 శాతం రిజ‌ర్వేష‌న్లు, గిరిజ‌న బంధు ప‌థ‌కం అమ‌లు అవుతుంద‌న్నారు. సీఎం కేసీఆర్ మాట త‌ప్ప‌రు. మ‌డ‌మ తిప్ప‌రు, ఆయ‌న మాట అంటే మాటే.. క‌చ్చితంగా చేస్తారు అన్నారు. ఆయ‌న‌కు మ‌నం అండ‌గా ఉండాలి, ఆయ‌న లాంటి సీఎం మ‌న‌కు దొర‌క‌రు అని మంత్రి ఎర్ర‌బెల్లి అన్నారు. సీఎం కేసీఆర్ ఇటీవ‌ల చేసిన‌, గిరిజ‌నుల‌కు 10శాతం రిజ‌ర్వేష‌న్లు, గిరిజ‌న బంధు ప్ర‌క‌ట‌న ప‌ట్ల మంత్రి ఎర్ర‌బెల్లికి కృత‌జ్ఞ‌త‌లు తెల‌ప‌డానికి పాల‌కుర్తి నియోజ‌క‌వ‌ర్గం నుండి హైద‌రాబాద్ కు త‌ర‌లి వ‌చ్చిన గిరిజ‌న నేత‌లు, ప్ర‌జా ప్ర‌తినిధులు, ఎంపీపీలు జెడ్పీటీసీలు, స‌ర్పంచ్‌లు, ఎంపీటీసీలు, ముఖ్య నాయ‌కులు,గ్రామ పార్టీ అధ్య‌క్షులు మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌రావుగారికి కృత‌జ్ఞ‌త‌లు, ధ‌న్య‌వాదాలు తెల‌ప‌డానికి వ‌చ్చారు. ఈ సంద‌ర్భంగా వారంద‌రినీ ఉద్దేశించి మంత్రి ఎర్ర‌బెల్లి మాట్లాడారు. గిరిజ‌నుల‌కు 10శాతం రిజర్వేష‌న్ల కోసం ఆరేండ్ల కిందనే అసెంబ్లీ తీర్మానం చేసి పంపిస్తే కేంద్రం ఆ బిల్లుని క‌నీసం ప‌ట్టించుకోలేద‌న్నారు. కొద్ది రోజుల క్రితం ఆ బిల్లే త‌మ వ‌ద్ద‌కు రాలేద‌ని బుకాయించార‌ని, చివ‌ర‌కు వ‌చ్చింద‌ని చెప్పార‌ని, ఈ ప‌రిస్థితుల్లో కేంద్రం ఉంటే ఎలా? అని మంత్రి చెప్పారు. అయితే, ఇటీవ‌ల గిరిజ‌న‌, ఆదివాసీ ఆత్మ‌గౌర‌వ సంత్ సేవాలాల్‌, కుమ‌రం భీం భ‌వ‌నాల‌ను హైద‌రాబాద్ లో ప్రారంభించిన స‌మ‌యంలో సీఎం, కేంద్రానికి గ‌ట్టిగా చెప్పార‌ని, కేంద్రం కాద‌న్నా, మన రాష్ట్రంలో గిరిజ‌నుల కోసం 10శాతం రిజ‌ర్వేష‌న్లు క‌ల్పించ‌డానికి సిద్ధంగా ఉన్నార‌ని తెలిపారు. అలాగే ద‌ళిత బంధు లాగే, గిరిజన బంధు ప‌థ‌కాన్ని అమ‌లు చేస్తామ‌ని చెప్పిన సిఎం కెసిఆర్ కి మ‌న‌మంతా కృత‌జ్ఞ‌త‌తో, అండ‌గా ఉండాల‌ని చెప్పారు. దేశంలో ఇలాంటి సిఎంలు లేర‌ని, ప్ర‌జ‌లంద‌రి కోసం ఆలోచిస్తున్న సీఎం కి మ‌న‌మంతా కృత‌జ్థ‌లు ధ‌న్య‌వాదాలు తెలపాల‌న్నారు. సంద‌ర్భాలు వ‌చ్చిన‌ప్ప‌డు మ‌నమంతా అండ‌గా నిల‌వాల‌ని గిరిజ‌న ప్ర‌తినిధులు, ప్ర‌జాప్ర‌తినిధుల‌కు మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు విజ్ఞ‌ప్తి చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement