Wednesday, May 22, 2024

Exclusive | హైద‌రాబాద్‌లో బెగ్గింగ్ మాఫియా ఆటక‌ట్టు.. నిర్వాహ‌కుడిని అరెస్టు చేసిన పోలీసులు

హైద‌రాబాద్ సిటీలో బెగ్గింగ్ మాఫియా ఆగడాలపై పోలీసులు కొర‌డా జులిపిస్తున్నారు. చిన్న పిల్లలు, వృద్ధులు, వికలాంగులను రద్దీ ఎక్కువగా ఉండే చౌరస్తాల్లో విడిచిపెట్టి భిక్షాటన చేయిస్తూ ఈ ముఠా లక్షలు దండుకుంటున్న‌ట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వెస్ట్‌జోన్ పోలీసులు స్పెషల్‌ డ్రైవ్‌ చేపట్టి.. బెగ్గింగ్‌ మాఫియా ఆటకట్టిస్తున్నారు. బెగ్గింగ్‌ మాఫియా చేతిలో భిక్షగాళ్లుగా మారిన వారిని రక్షిస్తూ, ముఠా నాయకులను అరెస్ట్‌ చేస్తున్నారు. బెగ్గింగ్‌ మాఫియా నాయకులు భిక్షాగాళ్లు సేకరించిన నగదు నుంచి వారి కేవలం రూ.100, రూ.200 ఇస్తూ మిగతాదంతా తమ జేబుల్లో నింపుకుంటున్న‌ట్టు పోలీసుల ఎంక్వైరీలో వెల్ల‌డ‌య్యింది. ఇలా ఒక్కో బెగ్గింగ్‌ గ్యాంగ్‌ నడిపే వ్యక్తి నెలకు రూ.2ల‌క్షల నుంచి రూ.3లక్షల దాకా వెనుకేసుకుంటున్నట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.

లేటెస్ట్‌గా చిన్న పిల్లలను యాచకులుగా మార్చి, రోడ్లపై వదిలేసి సాయంత్రానికి వారు తీసుకొచ్చిన డబ్బులను వసూలు చేసుకుంటున్న బెగ్గింగ్‌ ముఠా నిర్వాహకుడిని ఫిలింనగర్‌ పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. ఫిలింనగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెస్ట్‌జోన్‌ అదనపు డీసీపీ హనుమంతరావు, జూబ్లీహిల్స్‌ ఏసీపీ కె.హరిప్రసాద్‌, సీఐ రామకృష్ణతో కలిసి వివరాలు వెల్లడించారు.

ఫిలింనగర్‌, బసవతారకం నగర్‌ బస్తీకి చెందిన వి. సూర్యప్రకాశ్‌ (36) ఫొటోగ్రాఫర్‌గా పనిచేసేవాడు. జల్సాలు, మద్యానికి బానిసైన అతను ఈజీగా డబ్బులు సంపాదించేందుకు బెగ్గింగ్‌ మాఫియాకు తెరలేపాడు. ఐదుగురు పిల్లలను చేరదీసి వారికి స్టీల్‌ బాక్సులు ఇచ్చి ఫిలింనగర్‌ బస్టాప్‌, పరిసర ప్రాంతాల్లో డబ్బులు వసూలు చేయించేవాడు. సాయంత్రం వారు తీసుకొచ్చే డబ్బులు లాక్కునేవాడు. సినిమాలో మాదిరిగా రోజూ ఒక్కొక్కరికి రూ. వెయ్యి నుంచి రూ.2 వేల వరకు వసూలయ్యేవి. ఇందులో రూ.100 చొప్పున భిక్షాటన చేసిన పిల్లలకు ఇచ్చి మిగతావి తాను తీసుకునేవాడు.

దీనిపై సమాచారం అందడంతో వెస్ట్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ ఫోలీసులు, ఫిలింనగర్‌ పోలీసులు సంయుక్తంగా రైడ్‌ చేసి నిందితుడిని అరెస్ట్‌ చేశారు. పిల్లలను రక్షించి మోండా మార్కెట్‌లోని అమన్‌వేదిక స్నేహగర్‌కు తరలించారు. నిందితుడి నుంచి స్మార్ట్‌ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement