Saturday, April 27, 2024

ఆన్ లైన్‌లోనే తరగతులు: తెలంగాణ ప్రభుత్వం కీలక ఆదేశాలు

తెలంగాణలో జులై 1 నుంచి విద్యాసంస్థలు పున:ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో ఆన్‌లైన్‌లోనే పాఠశాలల తరగతులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పట్లో ప్రత్యక్ష బోధనకు తొందరేమీ లేదని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. వెంటనే ఆన్ లైన్ క్లాసులకు సంబంధించి ఉత్తర్వులు జారీ చేయాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి సీఎం ఆదేశించారు. 50 శాతం ఉపాధ్యాయులు హాజరయ్యేలా చూడాలని నిర్దేశించారు.

ఇటీవలే తెలంగాణలో కరోనా వైరస్ తగ్గడంతో లాక్ డౌన్ ఆంక్షలు ఎత్తివేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం జులై 1 నుంచి విద్యాసంస్థల ప్రారంభానికి అనుమతిచ్చింది. కానీ స్కూళ్లలో ప్రత్యక్ష బోధన సాగుతుందా? ఆన్ లైన్ బోధనా? అనేది స్పష్టత ఇవ్వలేదు. తాజాగా సీఎం కేసీఆర్ ప్రకటనతో ఆన్ లైన్ బోధనే అనేది స్పష్టమైంది.

కాగా, ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ను పీఆర్టీయూ నాయ‌కులు క‌లిశారు. ఉపాధ్యాయుల స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించాల‌ని కోరుతూ సీఎంకు వారు విన‌తిప‌త్రం స‌మ‌ర్పించారు. కొత్త జిల్లాల ప్రాతిపదికన క్యాడర్ విభజన పూర్తి చేసి పదోన్నతులు, బదిలీల ప్రక్రియ ప్రారంభించాలని సీఎంను కోరారు. అలాగే, కరోనా పరిస్థితుల నేపథ్యంలో పాఠశాలల పున: ప్రారంభాన్ని తాత్కాలికంగా వాయిదా వేయాలని, ఆన్‌లైన్‌లోనే విద్యాబోధన కొనసాగించేలా చూడాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. 50శాతం ఉపాధ్యాయులు హాజరయ్యేలా ఆదేశించాలని సీఎం కేసీఆర్‌కు పీఆర్టీయూ నాయ‌కులు విన్న‌వించారు.

ఇదీ చదవండి: హుజురాబాద్‌లో ఉప ఎన్నిక వేడి.. కాంగ్రెస్ లైట్ తీసుకుందా?

Advertisement

తాజా వార్తలు

Advertisement