Friday, April 26, 2024

కూలడానికి సిద్ధంగా బిజ్వార్ పశువైద్యశాల..

ఊట్కూరు : మండలం బిజ్వార్ గ్రామంలో మూగజీవాల కోసం గత కొన్ని సంవత్సరాల క్రితం నిర్మించిన పశు వైద్యశాల శిథిలావస్థకు చేరుకొని కూలడానికి సిద్ధంగా ఉన్న అధికారులు ప్రజా ప్రతినిధులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైద్యశాలలో భారీ వృక్షం భవనంపై వేలాడుతూ ఉండడంతో సిబ్బంది రైతులు అటు వెళ్లాలంటేనే ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వెళ్లాల్సిన పరిస్థితి దాపురించింది. పశు వైద్యశాల చుట్టూ ముళ్ళ పొదలు ఉండడంతో విష పురుగులు సంచరిస్తున్నాయి. పశు వైద్యశాల నూతన భవనానికి నిధులు మంజూరు చేసి వెంటనే భవనం నిర్మించాలని రైతులు కోరుతున్నారు. పశు వైద్యశాల శిథిలావస్థలో ఉండటంతో మూగజీవాలకు వైద్యం గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద నిర్వహించాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో గ్రామ పంచాయతీకి వచ్చే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పశు వైద్యశాల శిథిలావస్థకు చేరుకోవడంతో అందులో ఉన్న ఫ్రిడ్జ్ తో పాటు వివిధ రకాల వస్తువులు మందులు గ్రామపంచాయతీ కార్యాలయంలో భద్రపరిచారు. గత 6 సంవత్సరాల నుండి పంచాయతీ కార్యాలయం వద్ద మూగజీవాలకు చికిత్సలు నిర్వహిస్తుండడంతో అత్యవసర సమయంలో పంచాయతీ కార్యాలయం వద్ద వైద్య సిబ్బంది పై గ్రామస్తులతో తిట్లు తినాల్సిన పరిస్థితి నెలకొంది. భవనం నిర్మించాలని అధికారులకు ప్రజాప్రతినిధులకు విన్నవించినా పట్టించుకోవడంలేదని పలువురు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు వెంటనే స్పందించి బిజ్వార్ పశు వైద్యశాల నిర్మాణానికి నిధులు కేటాయించి భవనం నిర్మించాలని రైతులు పశువు వైద్య సిబ్బంది కోరుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement