Saturday, March 16, 2024

అచ్చంపేట మున్సిపాలిటీ టి ఆర్ ఎస్ కైవ‌సం..

అచ్చంపేట మున్సిపాలిటీని రెండోసారి అధికార టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. ఏప్రిల్ 30న జరిగిన మున్సిపాలిటీ ఎన్నికలలో టిఆర్ఎస్, కాంగ్రెస్, బిజెపి, పోటీ పడగా అందులో టిఆర్ఎస్ రెండోసారి మున్సిపాలిటీ చైర్మన్ స్థానాన్ని దక్కించుకున్నది. సోమవారం అచ్చంపేట లో జె ఎం జె పాఠశాలలో నిర్వహించిన ఓట్ల లెక్కింపులో టీఆర్ఎస్ కు 13 కౌన్సిలర్ స్థానాలు దక్కించుకోగా కాంగ్రెస్ 6 బిజెపి ఒక స్థానంలో గెలిచాయి. మొత్తం 20 వార్డులకు గాను జరిగిన ఎన్నికలలో మునుపటి కంటే కాంగ్రెస్ 6 స్థానాలు దక్కించుకొని పార్టీ ప్రతిష్టతను నిలుపుకుంది. అదేవిధంగా బిజెపి ఊహించని రీతిలో 9 వ వార్డు కౌన్సిలర్ ను స్వల్ప ఓట్లతో దక్కించుకుంది. 20 కి 20 కౌన్సిలర్ల స్థానాలు గెలుచుకోవడానికి టిఆర్ఎస్ చేసిన ప్రయత్నం విఫలం అయిందని చెప్పవచ్చు గతంలో 20 కి 20 గెలుచుకున్న అధికార టీఆర్ఎస్ పార్టీ ఈసారి తన ఆధిపత్యానికి గండి పడింది. గత ఎన్నికలలో ఇచ్చిన హామీలను విస్మరించడం తోనే మిగతా ఏడు స్థానాలకు టిఆర్ఎస్ కోల్పోవడానికి ప్రధాన కారణమని పలువురు పట్టణ ప్రజలు చర్చించుకుంటున్నారు. మొత్తం 20 స్థానాలు గాను ఒకటవ వార్డు కౌన్సిలర్ గా కాంగ్రెస్ కు చెందిన గౌరీ శంకర్, రెండవ వార్డు కు గాను టిఆర్ఎస్ కు చెందిన సుంకరి నిర్మల, మూడవ వార్డు కు గాను టిఆర్ఎస్ కు చెందిన సోమ్లా నాయక్, నాలుగవ వార్డు లో టిఆర్ఎస్ కు చెందిన మేరాజ్ బేగం, ఐదవ వార్డు లో టిఆర్ఎస్ కు చెందిన ఆకుల లావణ్య, ఆరవ వార్డు లో టిఆర్ఎస్ కు చెందిన గడ్డం రమేష్, ఏడవ వార్డు కాంగ్రెస్ కు చెందిన నూరి బేగం, అదేవిధంగా 8 వ వార్డులో కాంగ్రెస్ కు చెందిన చిట్టెమ్మ, 9వ వార్డులో బీజేపీకి చెందిన సుగుణమ్మ, 10వ వార్డులో కాంగ్రెస్ కు చెందిన సునీత, లు గెలుపొందారు. 11వ వార్డులో కాంగ్రెస్ కు చెందిన మధు నాగుల సంధ్య, 12వ వార్డు లో టిఆర్ఎస్ కు చెందిన కాజా బీ, 13వ వార్డు లో టిఆర్ఎస్ కు చెందిన అంతటి శివ, 14 వ వార్డులో కాంగ్రెస్ కు చెందిన గార్లపాటి శ్రీనివాసులు, 15 వార్డులో టిఆర్ఎస్ కు చెందిన మనోహర్ ప్రసాద్, 16 వ వార్డులో టిఆర్ఎస్ కు చెందిన ఎడ్ల నరసింహ గౌడ్, 17వ వార్డు లో టిఆర్ఎస్ కు చెందిన తగరం శ్రీను, 18వ వార్డులో టిఆర్ఎస్ కు చెందిన గోపిశెట్టి శివ, 19 వ వార్డు లో టిఆర్ఎస్ కు చెందిన పో రెడ్డి శైలజ, 20వ వార్డు లో టిఆర్ఎస్ కు చెందిన రమేష్ రావు, లు గెలిచారు. దీంతో 13 స్థానాల్లో గెలిచిన అధికార టీఆర్ఎస్ పార్టీ చైర్మన్ పీఠం గెలుచుకుంది. ఈ రెండు మూడు రోజుల్లో పాలకవర్గం ప్రమాణ స్వీకారం చేయనున్న ట్లు మున్సిపాలిటీ అధికార వర్గాలు తెలిపాయి. కౌంటింగ్ కేంద్రం వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అచ్చంపేట డీఎస్పీ నరసింహులు ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది.


Advertisement

తాజా వార్తలు

Advertisement