Friday, April 26, 2024

జాతీయ స్థాయిలో మెరిసిన పల్లె కుసుమం

జనగామ: అంతర్జాతీయ స్థాయిలో సిస్కో నెట్​వర్కింగ్​ అకాడమీ నిర్వహించిన పోటీల్లో ఓ మారుమూల పల్లెకు చెందిన అమ్మాయి సత్తా చాటింది. వివిధ దేశాల విద్యార్థుల​తో పోటీ పడి ప్రధమ స్థానంలో నిలిచింది. జనగామ జిల్లా పాలకుర్తి మండలంలోని ఈరవెన్ను గ్రామంలో రైతు కుటుంబానికి చెందిన పొన్నాల సోమిరెడ్డి-భారతి దంపతుల కూతురు భాషిత ఈ ఘనత సాధించింది. సోమిరెడ్డి రియల్​ ఎస్టేట్​ వ్యాపారం దృష్ట్యా హైదరాబాద్​లో స్థిరపడ్డారు. భాషితను ఎంతో కష్టపడి ఉన్నత చదువులు చదివించారు. ప్రస్తుతం ఆమె హైదరాబాద్​లోని వాసవీ ఇంజినీరింగ్​ కాలేజీలో కంప్యూటర్​ సైన్స్​ చదువుతోంది.

గత నెల 29న నెట్​వర్కింగ్​ నైపుణ్యాలను పెంపొందించేందుకు ఆసియా పసిఫిక్​ జపాన్​ అండ్​ గ్రేటర్​ చైనా(ఏపీజేసీ) నెట్​క్యాడ్​ రైడర్స్​ పోటీలు నిర్వహించగా భాషిత పాల్గొంది. ఆన్​లైన్​ కాంపిటీషన్స్​లో దేశవ్యాప్తంగా 994 మందితో పోటీ పడి అగ్రస్థానంలో నిలిచింది. ఈ నెల 24న జరిగే అంతర్జాతీయ స్థాయి ఫైనల్స్​లో 15 దేశాలకు చెందిన టాపర్స్​తో ఆమె పోటీ పడనుంది. అందులోనూ గెలిచి గ్లోబల్​ టాపర్​గా నిలుస్తానని భాషిత ధీమా వ్యక్తం చేశారు. పల్లెలో పుట్టి పెరిగిన విద్యార్థిని ప్రపంచ స్థాయిలో ర్యాంకు సాధించడం జనగామ జిల్లాకే గర్వకారణమని పలువురు హర్షం వ్యక్తం చేశారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement