Sunday, May 26, 2024

Iskon Temple అభివృద్దే కాదు ఆధ్యాత్మికత లో ముందుండాలని ఇస్కాన్ ఆలయ నిర్మాణం – మంత్రి గంగుల

కరీంనగరాన్ని ఓ వైపు పర్యాటకంగా అభివృద్ది చేస్తూనే… ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. గురువారం హరే రామ హరే కృష్ణ, ఇస్కాన్ ప్రతినిధులతో మంత్రి గంగుల సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కరీంనగరానికి ఓ వైపు టిటిడి శ్రీవారి ఆలయం… మరో వైపు ఇస్కాన్ ఆలయంతో నగరం ఆధ్యాత్మిక కేంద్రంగా వెల్లివిరియనున్నాయన్నారు మంత్రి గంగుల కమలాకర్. ప్రజల్లో ఆధ్యాత్మికత… భక్తిభావం పెంపొందినప్పుడే… భయం పెరిగి… క్రమశిక్షణ అలవడుతుందన్నారు. ఇందుకోసం ప్రతి సంవత్సరం కరీంనగర్ లో శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరుపుకుంటున్నామని… దీంతో స్వామి వారే…తిరుమల నుండి కరీంనగర్ కు తరలివచ్చి… ఇక్కడే నివాసం ఏర్పాటు చేసుకుంటున్నారన్నారు. ఇందుకోసం నగరంలో టిటిడి ఆధ్వర్యంలో గొప్ప క్షేత్రాన్ని నిర్మిస్తున్నామని… ఇప్పటికే ఆలయ నిర్మాణం కోసం సిఎం కెసిఆర్ 10 ఎకరాల స్థలాన్ని కెటాయించగా… ఆలయ నిర్మాణానికి భూమిపూజ చేసుకున్నామన్నారు. మరో 15 రోజుల్లో ఆలయ నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయని తెలిపారు.

కరీంనగర్ అభివృద్దే కాదు… నగరం ఆధ్యాత్మికతలో ముందుండాలని… ప్రజల్లో దైవభక్తిని పెంపొందించాలని… డ్యామ్ పరిసర ప్రాంతంలో ఇస్కాన్ ఆలయ నిర్మాణానికి పూనుకున్నామన్నారు. ఇస్కాన్ ఆలయ నిర్మాణం కోసం సిఎం కెసిఆర్ 3 ఎకరాల స్థలాన్ని కెటాయించారని… ఇస్కాన్ వారిచే 20 కోట్లతో ఆలయ పనులను త్వరలోనే ప్రారంభించుకోనున్నామన్నారు. ఆలయ నిర్మాణం గురించి ప్రజల్లోకి తీసుకువెళ్ళేందుకు… ఈ నెల 7వ తేది శనివారం… మధ్యాహ్నం 3 గంటలకు తెలంగాణ చౌక్ నుండి… ఆలయాన్ని నిర్మించే ప్రతిపాదిత స్థలం వరకు… హరే రామ హరే క్రిష్ణ అధ్వర్యంలో… రాధ గోవిందుడి శోభాయాత్రను పెద్ద ఎత్తును నిర్వహిస్తున్నామన్నారు.

ఈ కార్యక్రమంలో… విదేశీయులు, యాదవ సోదరులతో పాటు… క్రిష్ణుడి భక్తులు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారని. నగర వాసులు సైతం పెద్ద ఎత్తున తరలివచ్చి… విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. నేటి తరంలో అధ్యాత్మికతను… భక్తిని పెంపొందించేందుకే ఓ వైపు టిటిడి ఆధ్వర్యంలో శ్రీవారి ఆలయాన్ని… మరోవైపు ఇస్కాన్ ఆధ్వర్యంలో శ్రీక్రిష్ణుడి ఆలయాన్ని నిర్మిస్తున్నామన్నారు. ఈ ఆలయాల నిర్మాణాలు పూర్తైతే… కరీంనగరం ఓ వైపు పర్యాటక కేంద్రంగా… మరోవైపు ఆధ్యాత్మిక కేంద్రంగా మారనుందన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్,హరేరామ హరేకృష్ణ ప్రతినిధులు నరహరి స్వామి, బుర్ర మధుసూధన్ రెడ్డి ,రాజేందర్ రెడ్డి, నరేష్ రెడ్డి, రాజ భాస్కర్ రెడ్డి, రమేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement