Saturday, April 27, 2024

ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడమే ప్రధాన ఉద్దేశ్యం : గద్వాల్ విజయ లక్ష్మి

ప్రజలకు మౌలిక సదుపాయాలను కల్పించడం ప్రధాన ఉద్దేశ్యంతో ముందుకు పోతున్నట్లు న‌గ‌ర‌ మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి అన్నారు. పంజాగుట్ట సెంట్రల్ మాల్ వద్ద రూ.5 కోట్ల వ్యయంతో చేపట్టిన ఫుట్ ఓవర్ బ్రిడ్జిని ఖైరతాబాద్ శాసనసభ్యులు దానం నాగేందర్ తో కలిసి మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ… నగరం విశ్వ నగరంగా ఎదుగుతున్న నేపథ్యంలో ప్రజలకు అసౌకర్యం కాకుండా అవసరమైన పనులను పూర్తి చేసి అందుబాటులోకి తేవడం జరుగుతుంద‌న్నారు. విద్య, ఉపాధి అవకాశాల కోసం ఇతర రాష్ట్రాల, ఇతర ప్రాంతాల నుంచి వచ్చే ప్ర‌జ‌ల‌తో ట్రాఫిక్ పెరుగుతున్న నేపథ్యంలో అధిగమించేందుకు సిగ్నల్ ఫ్రీ రవాణా వ్యవస్థ మెరుగుపర్చడం జరిగిందని రాష్ట్ర మున్సిప‌ల్ పరిపాలన శాఖ ఐటి మంత్రి కేటీఆర్ ముందు చూపుతో నగర ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వ్యూహాత్మకంగా అభివృద్ధికి కృషి చేస్తున్నారని మేయర్ వెల్లడించారు. పంజాగుట్ట జంక్షన్ వద్ద విపరీతమైన ట్రాఫిక్ ఉన్న నేపథ్యంలో ప్రమాదాల నివారణకు ఫుట్ ఓవర్ బ్రిడ్జి వల్ల ఎంతగానో ఉపయోగ పడుతుందన్నారు. వరద నివారణకు నాలా పనులను వేగవంతం పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. పంజాగుట్ట బ్రిడ్జి మిల్డ్ స్టీల్ ( ఏం యస్) చేపట్టారు. లిఫ్ట్, ఎస్కలేటర్ కూడా ఏర్పాటు చేశారు. సెంట్రల్ మాల్ వద్ద వాహనాల రద్దీ ఎక్కువ గా ఉండడం, ప్రయాణికులు రోడ్డుకు ఇరువైపులా రోడ్డును క్రాసింగ్ చేయాలంటే ఇబ్బందితో పాటుగా తరుచుగా ప్రమాదాలు జరిగేవని, దాన్ని అధిగమించేందుకు ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టినట్లు మేయర్ తెలిపారు. నగరంలో ట్రాఫిక్ ఎక్కువ ఉన్న ప్రాంతాలను గుర్తించి ప్రజల సౌకర్యం కోసం సుమారు 40 లొకేషన్ల‌లో ఫుట్ ఓవర్ బ్రిడ్జిలను చేపట్టనున్నట్లు మేయర్ అన్నారు. ఖైరతబాద్ శాసనసభ్యులు దానం నాగేందర్ మాట్లాడుతూ… నగరాన్ని విశ్వనగరంగా అభివృద్ధి చేయడం కోసం కేటీఆర్ యాక్షన్ ప్లాన్ తో ముందుకు పోతున్నట్లు ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు ముంబాయ్ తర్వాత హైదరాబద్ లోనే ఎక్కువగా ఉన్నాయని, నగర అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వ వినూత్న పథకాలను ద్వారా అమలు చేస్తూ ప్రజల కనీస అవసరాలను గుర్తించి అందుబాటులోకి తెస్తున్నట్లు తెలిపారు. దేశంలో ఇతర రాష్ట్రాల కంటే తెలంగాణలోనే అభివృద్ది, సంక్షేమ పథకాలు ఎక్కువగా అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో ఖైరతాబాద్ ఇన్‌ఛార్జి జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, యస్ సి రత్నాకర్, ఈఈ ఇందిరా బాయి, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement