Sunday, May 12, 2024

TS: తెలంగాణలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే…. రాహుల్ గాంధీ

మంథని (ప్రభ న్యూస్) : వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కచ్చితంగా ఏర్పడి తీరుతుందని, కాంగ్రెస్ ఎంపీ, సీడబ్ల్యూసీ మెంబర్ రాహుల్ గాంధీ అన్నారు. గురువారం కాంగ్రెస్ విజయభేరి యాత్రలో భాగంగా పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలోని పెట్రోల్ పంప్ చౌరస్తా నుండి రాహుల్ గాంధీ యాత్ర కొనసాగింది. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి రాహుల్ గాంధీ హిందీలో ప్రసంగిస్తూ… కాంగ్రెస్ మేనిఫెస్టో చైర్మన్, మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ళ శ్రీధర్ బాబు తెలుగులో అనువదించారు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాల పార్టీ అని, ఒక వ్యక్తికి, ఒక కుటుంబానికి సంబంధించిన పార్టీ కాదని, ముమ్మాటికి కాంగ్రెస్ పార్టీ ప్రజల పార్టీ అన్నారు. 6 గ్యారంటీ పథకాలతో తెలంగాణలో గ్యారెంటీగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అవుతుందని ధీమా వ్యక్తం చేశారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన మొదటి రోజున ఆరు గ్యారెంటీ పథకాలు తక్షణమే అమలు చేస్తామన్నారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రజలను దోచుకుంటూ అవినీతి పాలన చేస్తున్నారని, అవినీతి పాలన అంతం చేయడానికి కాంగ్రెస్ విజయభేరి యాత్ర కొనసాగిస్తుందన్నారు. అధికారంలో ఉన్న పార్టీలు శతవిధాలుగా ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నించినప్పటికీ, ప్రజల అండతో ఇబ్బందులన్నీ ఎదుర్కొన్నామని, ఇదే ప్రజల అండతో రాబోయే రోజుల్లో అధికారంలోకి వస్తామని వారు వివరించారు. తెలంగాణ ఇచ్చింది ముమ్మాటికీ కాంగ్రెస్ పార్టీయే అని, కొట్లాడి సంపాదించుకున్న తెలంగాణలో కొద్ది మంది మాత్రమే అధికారం చేపట్టారని తీవ్రంగా విమర్శించారు.

కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఆదానికి వత్తాసు పలుకుతుందని, రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం బీజేపీకి బీ టీంగా పనిచేస్తుందని ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో స్థానిక అభ్యర్థి అయిన శ్రీధర్ బాబును అఖండ మెజారితో గెలిపించుకోవాలని ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ అగ్రశ్రేణి నాయకులు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, సీతక్క, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మంథని డివిజన్ కాంగ్రెస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement