Sunday, April 28, 2024

TS: బీఆర్ఎస్ తోనే సంక్షేమం సాధ్యం… కోరుట్ల ఎమ్మెల్యే

ఎన్ని దొంగ హామీలిచ్చినా, ఎన్ని అసత్యపు ప్రచారాలు చేసినా ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని, సంక్షేమం బీఆర్ఎస్ తోనే సాధ్యమని కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు, బీఆర్ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల సంజయ్ లు తెలియజేశారు. గురువారం కోరుట్ల పట్టణంలో ఇంటింటా ప్రచారం నిర్వహించి గత తొమ్మిదిన్నరేళ్లలో ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని వివరించారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి కారు గుర్తుకు ఓటు వేసి డాక్టర్ సంజయ్ కు మద్దతు ఇవ్వాలని కోరారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని సంక్షేమ పథకాలను ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో అమలు చేస్తున్నరన్నారు.

ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ఆరు గ్యారెంటీ స్కీములని కాంగ్రెస్ ప్రజలను నమ్మించాలని ప్రయత్నిస్తున్నా వారు నమ్మడం లేదన్నారు. కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రైతుబంధు, రైతు బీమా, బీసీ బందు, మైనార్టీ బందు, దళిత బంధు, షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి, కేసీఆర్ కిట్టు లాంటి ఒక్క పథకం కూడా ఎందుకు అమలు చేయడం లేదన్నారు. మొండి చేతికి ఓటు వేస్తే తిరిగి కరెంటు, నీటి కష్టాలు వస్తాయన్నారు. గతంలో అధికారంలో ఉన్నప్పుడు నియోజకవర్గం లో ఏమి అభివృద్ధి చేశారన్నారు. రెండేళ్ల పాటు కరోనా విపత్కర పరిస్థితులున్నా నియోజకవర్గంలో వేలాది కోట్ల రూపాయల అభివృద్ధి పనులు చేశామన్నారు. సీఎం కేసీఆర్ దార్షనికతతో జగిత్యాల జిల్లా అయిందన్నారు. హ్యాట్రిక్ సీఎంగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేయడం ఖాయమని, కోరుట్ల నియోజకవర్గంలో కూడా ప్రజలు గులాబీ పార్టీవైపే ఉన్నారన్నారు. బారాస ఎన్నికల మేనిఫెస్టోను చూసి కాంగ్రెస్, బీజేపీ లు ఖంగుతిన్నాయని, వారికి ఓటమి కళ్ళ ముందు కనబడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో బారాస ప్రజా ప్రతినిధులతో పాటు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement