Thursday, May 2, 2024

TS: 6 గ్యారెంటీలు అమలు చేసినట్లు నిరూపిస్తే పోటీ నుండి తప్పుకుంటా.. బండి సంజ‌య్

…డేట్, టైం, వేదిక మీరే నిర్ణయించండి
…నిరూపించకపోతే కాంగ్రెస్ అభ్యర్థులంతా పోటీ నుండి తప్పుకోవాలి
… అసలు శ్రీరాముడంటే మీకెందుకంత కసి
..కాంగ్రెస్, బీఆర్ఎస్ లపై విరుచుకుపడ్డ బండి సంజయ్
ఆరు గ్యారెంటీలు ఇస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ గ్యారెంటీలను అమలు చేసినట్లు నిరూపిస్తే పోటీ నుండి తప్పుకుంటానని కరీంనగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ సభలు చేశారు. శనివారం కరీంనగర్ లోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ… 6 గ్యారెంటీల అమలుపై చర్చ జరగకుండా ప్రజల దృష్టిని మళ్లించేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల నేతలు డ్రామాలాడుతూ మీడియాలో బ్రేకింగుల కోసం యత్నిస్తున్నారని మండిపడ్డారు. వంద రోజుల్లో 6 గ్యారెంటీలను అమలు చేస్తామని హామీ ఇచ్చి మాట తప్పారన్నారు. గ్యారెంటీలు అమలు చేసినట్లు పచ్చి అబద్దాలాడుతున్నారని, మీకు సవాల్ చేస్తున్నా.. వాటిని అమలు చేసినట్లు నిరూపిస్తే తాను ఎన్నికల్లో పోటీ నుండి తప్పుకుంటా.. అవసరమైతే కాంగ్రెస్ తరపున ప్రచారం చేసేందుకు సిద్ధమేనన్నారు.

నిరూపించకపోతే కాంగ్రెస్ నుండి పోటీ చేస్తున్న 17 మంది అభ్యర్థులు ఎన్నికల బరి నుండి తప్పుకునేందుకు సిద్ధమా అంటూ సవాల్ చేశారు. కల్యాణ లక్ష్మి చెక్కుతో పాటు తులం బంగారం ఇచ్చినట్లు, విద్యార్థినిలకు స్కూటీలు అందించినట్లు, రైతు భరోసా కింద రైతులకు, కౌలు రైతులకు రూ.15000 ఇచ్చినట్లు, ఇల్లు లేని వారికి స్థలం అందించడంతో పాటు నిర్మాణానికి ఐదు లక్షలు ఇచ్చినట్లు, ఆసరా పింఛన్లను 4 వేలకు పెంచినట్లు నిరూపిస్తే పోటీ నుండి తప్పుకుంటానన్నారు. దమ్ముంటే ముఖ్యమంత్రితో పాటు మంత్రులు, కాంగ్రెస్ నాయకులు తన సవాల్ ను స్వీకరించి అమరవీరుల స్తూపం వద్ద కానీ భాగ్యలక్ష్మి ఆలయం వద్ద కానీ డేట్, టైం ఫిక్స్ చేసి చెప్తే చర్చకు వస్తానన్నారు.

దేశంలోని అన్ని మతాలు, వర్గాలను సమానంగా చూడాలన్నదే బీజేపీ విధానమని, కానీ బీజేపీ ఏది మాట్లాడినా మతతత్వమని ముద్రవేసే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇతర మతస్తుల ముందు హిందూ మతాన్ని హేళన చేసేలా మాట్లాడటం సిగ్గు చేటన్నారు. ఓట్ల కోసం సనాతన ధర్మాన్ని, హిందూ సంస్కృతి, సాంప్రదాయాలను కించపరుస్తారా.. అసలు వీళ్లు హిందువులేనా అని అనుమానం వస్తుందన్నారు. మాట్లాడితే అయోధ్య అక్షింతలను కించపరుస్తున్నారు.. అసలు రాముడంటే ఎందుకంత కసి, రాముల వారి అక్షింతలను, ప్రసాదాన్ని కూడా కించపరుస్తున్నారన్నారు. ఒకాయన రేషన్ బియ్యం అంటారు.. నిన్న కేసీఆర్ అక్షింతలు పంచితే తీర్ధ ప్రసాదాలు పంచితే కడుపు నిండుతదా అని మాట్లాడటం సిగ్గుచేటన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement