Wednesday, July 24, 2024

Saffron | కుంకుమ పువ్వుకు భారీ డిమాండ్‌..

దేశంలో కుంకుమ పువ్వు ధరలకు రెక్కలొచ్చాయి. దీనికి యుద్ధం సెగ తగిలింది. సరిపడినంత సరఫరా లేకపోవడంతో రిటైల్‌ మార్కెట్‌లో కేజీ కుంకుమ పువ్వు ధర 5 లక్షలకు చేరింది. కుంకుమ పువ్వును సుగంధ ద్రవ్యాల రారాణిగా వ్యవహరిస్తారు. వంటల నుంచి ఔషధాలు, సౌందర్య సాధనాల్లోనూ దీన్ని వినియోగిస్తున్నారు. కశ్మీర్‌లో దీన్ని ఎర్ర బంగారమని ముద్దుగా పిలుచుకుంటారు.

ప్రపంచంలోలో పండే కుంకుమ పువ్వులో 90 శాతం ఇరాన్‌లోనే పండిస్తున్నారు. అక్కడ ప్రతి సంవత్సరం 430 టన్నుల కుంకుమ పువ్వుల ఉత్పత్తి జరుగుతోంది. ఇజ్రాయెల్‌-గాజా యుద్ధంతో గత కొన్ని నెలలుగా పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ఇరాన్‌ నుంచి కుంకుమపువ్వు సరఫరా భారీగా తగ్గిపోయింది. దీంతో దేశీయంగా దీని ధర విపరీతంగా పెరిగింది.

మన దేశంలో కుంకుమ పువ్వును అత్యధికంగా జ మ్మూకశ్మీర్‌లో పండిస్తారు. ఇరాన్‌ నుంచి దిగుమతి తగ్గడంతో దేశీయ వర్తకులు, ఉత్పత్తిదారులకు డిమాండ్‌ పెరగడంతో ధర భారీగా పెరిగింది. హోల్‌సేల్‌లో 20 శాతం రిటైల్‌లో 27 వాతం మేర ధర పెరిగినట్లు వార్తలు వచ్చాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలకు ముందు హోల్‌సేల్‌లో కిలో కుంకుమ పువ్వు ధర 2.8 నుంచి 3 లక్షల వరకు ఉంది. ఇప్పుడు ఈ ధర 3.5-3.6 లక్షలకు చేరింది.

రిటైల్‌ మార్కెట్‌లో కేజీ ధర 4.95 లక్షలు పలుకుతోంది. 70 గ్రాముల బంగారం ధరకు ఇది సమానం. మన దేశంలో ప్రతి సంవత్సరం 60-65 టన్నుల కుంకుమ పువ్వుకు డిమాండ్‌ ఉంది. ప్రపంచ వ్యాప్తంగా పండే దానితో పోలిస్తే కశ్మీరీ కుంకుమ పువ్వు ప్రత్యేకమైనది. కొన్ని సంవత్సరాలుగా దీని ఉత్పత్తి తగ్గుతూ వస్తోంది. ప్రస్తుతం మన దేశంలో కేవలం 3 టన్నుల కంటే తక్కువగానే దీన్ని ఉత్పత్తి చేస్తున్నారు. దీంతో దేశీయ అవసరాలకు దిగుమతులపైనే ఆధారపడుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement