Thursday, May 2, 2024

Challenge – 24 గంట‌లు క‌రెంట్ ఇస్తున‌ట్లు నిరూపించండి ….నామినేష‌న్ కూడా వేయ‌నుః కెసిఆర్ కు రేవంత్ స‌వాల్

అలంపూర్ – 24 గంటల కరెంట్ వద్దు, 3 గంటల కరెంట్ చాలు అని తాను ఎక్కడ అన్నానో చూపించాలని ముఖ్య‌మంత్రి కెసిఆర్, మంత్రి కెటిఆర్ కు టిపిసిపి చీఫ్ రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. 24 గంటల విద్యుత్ ఇస్తున్నామంటూ చెప్పుకుంటున్న బీఆర్ఎస్ రైతులకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అలంపూర్ లో కాంగ్రెస్ అభ్య‌ర్ధి త‌ర‌పున జ‌రిగిన ఎన్నిక‌ల ప్ర‌చార స‌భ‌లో ఆయ‌న ప్ర‌సంగిస్తూ, ఏ సబ్‌స్టేషన్‌కైనా పోదామని.. 24 గంటల కరెంట్ ఇస్తుంటే, తాము నామినేషన్ కూడా వేయకుండా ఇంటి పోతామని ఆయన చురకలంటించారు. ఆలంపూర్ జోగులాంబ ఆలయాన్ని వంద కోట్లతో అభివృద్ధి చేస్తానని కేసీఆర్ చెప్పారని.. ఇవాళ ఆ గుడి పరిస్ధితి ఎలా వుందో చూడాలని రేవంత్ దుయ్యబట్టారు. ఉచిత విద్యుత్ ఆలోచన కాంగ్రెస్ పార్టీదేనని ఆయన అన్నారు.

కాంగ్రెస్ నీలం సంజీవరెడ్డిని రాష్ట్రపతిని చేస్తే.. చల్లా వెంకట్రామిరెడ్డి కల్వకుంట్ల కుటుంబం దగ్గర బానిసగా మారిపోయారని ఆయన చురకలంటించారు. ఆర్డీఎస్ పంచాయతీని కర్ణాటక ప్రభుత్వంతో కలిసి పరిష్కరించే బాధ్యత తనదని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. బోయల్ని ఎస్టీల్లో చేరుస్తానని చెప్పి కేసీఆర్ మోసం చేశారని ఆయన ఎద్దేవా చేశారు. ధరణి రద్దు చేస్తే రైతుబంధు ఎందుకు రాదని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ధరణి అనేది బీఆర్ఎస్‌కు ఏటీఎంలా మారిందని ఆయన ఆరోపించారు. సంపత్‌ను కాదని మీరు అబ్రహాన్ని గెలిపిస్తే.. ఇప్పుడు అబ్రహాన్ని తప్పించి మరొకరిని రప్పించారని రేవంత్ దుయ్యబట్టారు. బోయలకు ఎమ్మెల్సీ ఇచ్చే బాధ్యత కూడా తనదేనని ఆయన అన్నారు. పాలమూరు గడడపై 14కు 14 సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలవాలని పీసీసీ చీఫ్ ఆకాంక్షించారు. మన ఆత్మగౌరవంపై దాడి చేస్తున్నారని. 24 గంటలు ఉచిత విద్యుత్ ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీదేనని రేవంత్ అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement