Thursday, May 16, 2024

Janasena | కూటమి అధికారంలోకి వస్తే పాలకొండను బంగారు కొండ చేస్తా : పవన్ కళ్యాణ్

పాలకొండ : సిక్కోలు యువత భగభగ మండే నిప్పుకణికలని.. తెగించి పోరాడాలని.. 1960లో బామిని మండలంలో దోపిడీదారుల దాష్టీకాలు తట్టుకోలేక ఉత్తరాంధ్ర యువత తిరగబడిందని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ గుర్తు చేశారు. ఆరోజులు మళ్లీ వస్తాయని జగన్‌కు చెప్పాలన్నారు. గ్రామం.. సంగ్రామంగా మారడానికి ఎక్కువ సమయం పట్టదని.. తప్పు జరిగినప్పుడు ఎదురించకపోతే మన భవిష్యత్తు దెబ్బతింటుందన్నారు.. జై ఉత్తరాంధ్ర అంటే సరిపోదు.. అన్యాయం జరిగినప్పుడు తిరగబడాలన్నారు.

పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండలో నిర్వహించిన వారాహి విజయయాత్ర సభలో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ ప్రసంగించారు. ప్రసంగం మధ్యలో అక్కడే సీఎం జగన్ హోర్డింగ్ ఉండడాన్ని పవన్ కల్యాణ్ గమనించారు. ఆ హోర్డింగ్ పై జగన్ బొమ్మతో పాటు కలలు నిజం చేయడానికి… జగన్ కోసం సిద్ధం అని రాసి ఉంది. కెమెరా అటు తిప్పండయ్యా… అంటూ పవన్ ఆ హోర్డింగ్ ను చూపించారు.

కలలు నిజం చేయడానికి అంట… మెగా డీఎస్సీ ఇచ్చి మీ కలలు నిజం చేశాడా? ఉపాధి అవకాశాలు కల్పించాడా? ఎస్టీ సబ్ ప్లాన్ ఇచ్చాడా? అంటూ ప్రశ్నించారు. మహా మల్లయోధుడు కోడి రామ్మూర్తి ఇక్కడి వీరఘట్టం నుంచే వచ్చారని, ఒంటి చేత్తో గొలుసులను తెంపేవారని పవన్ కీర్తించారు. ఇక్కడ కోడి రామ్మూర్తి స్ఫూర్తి ఉన్న యువత ఉన్నారు… కానీ జగన్ కానీ, ఇక్కడున్న వైసీపీ నేతలు కానీ యువతకు ఎలాంటి ఉపాధి అవకాశాలు కావాలి అని అడిగారా? అని ప్రశ్నించారు.

మరెందుకయ్యా… ఆ పోస్టర్… సిద్ధం సిద్ధం అంటూ… ఏం కలలు నిజం చేస్తాడు? అంటూ ధ్వజమెత్తారు. మద్యపాన నిషేధం చేస్తానన్నాడు, కానీ రూ.60 క్వార్టర్ ను రూ.200కి అమ్ముతున్నాడు… 30 వేల మంది ఆడపిల్లలు అదృశ్యమైపోతే వారి ఇంట్లో వాళ్ల ఏడుపులు నిజం చేయడానికి వచ్చాడా? సీపీఎస్ రద్దు చేస్తానని చెప్పాడు… కానీ రద్దు చేయలేదు… ఇంకేం కలలు నిజం చేస్తాడు? అంటూ పవన్ నిలదీశారు.

తనకు ఉత్తరాంధ్ర అంటే పంచ ప్రాణాలు అని వెల్లడించారు. ఉత్తరాంధ్ర ప్రాంతం, భాష, యాస గుండె కదిలించేస్తాయని అన్నారు. అరకు, పాడేరు ప్రాంతాల్లో తిరిగిన వాడ్ని, ఏవోబీ (ఆంధ్రా ఒడిశా బోర్డర్)లో తిరిగిన వాడ్ని, కష్టాలు చూసినవాడ్ని, యువత కడుపు మంట తెలిసిన వాడ్ని, ఉపాధి అవకాశాల్లేక వలస వెళ్లిపోతున్న యువత ఆక్రోశాన్ని అర్థం చేసుకున్నవాడ్ని అని వివరించారు.

- Advertisement -

అందరిలాగా ఓటమిని అంగీకరించి పారిపోవడం నా వల్ల కాదు… అందుకే దశాబ్దకాలంగా రాజకీయాల్లో కొనసాగుతున్నాను అని వెల్లడించారు. నాకు నిలబడడం ఒక్కటే తెలుసు అని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ఉత్తరాంధ్ర కళామతల్లి ద్వారా తాను ఆటా పాటా నేర్చుకున్నానని చెబుతూ పవన్ కల్యాణ్ ‘మల్లీ నీకెందుకురా పెళ్లి’ అనే గీతాన్ని ఆలపించారు.

అంతేగాకుండా, ఏం పిల్లడో ఎల్దమొస్తవా, బాయ్ బాయే బంగారు రమణమ్మ అనే గీతాలు ఉత్తరాంధ్రలో తిరిగినప్పుడు తనకు పరిచయం అయ్యాయని వివరించారు. ఉత్తరాంధ్ర యాసను తెలుగు సినిమాల్లో పెట్టాలా, వద్దా అని చాలామంది ఆలోచిస్తుంటారని, కానీ ఉత్తరాంధ్ర యాస తన గుండెల్లో మోగుతుంటుందని పవన్ కల్యాణ్ అన్నారు.

తెలుగు వాడుక భాషోద్యమం చేపట్టిన గిడుగు రామ్మూర్తి సవర భాష అంతరించిపోకుండా ఆ భాషకు ఓ నిఘంటువును కనిపెట్టారని కొనియాడారు. శ్రీశ్రీ వంటి మహాపండితులు, ఉద్ధండులను అందించిన నేల ఈ ఉత్తరాంధ్ర అని పేర్కొన్నారు. ఉత్తరాంధ్ర యాస అంటే తనకు ఎంతో ఇష్టమని.. తన చిత్రాల్లో పాటలు కూడా ఉన్నాయన్నారు.

జగన్‌ సిద్ధం సిద్ధం అంటున్నారు.. దేనికి సిద్ధమని పవన్ ఎద్దేవా చేశారు. ఉద్యోగాలు లేవు , మద్యం రేట్లు పెంచారన్నారు. గిరిజన యువతికి ట్రైకార్ నిధులు లేవన్నారు. ప్రభుత్వ భవనాలకు రంగులు వేయడానికి రూ.1300 కోట్లు, తీసేయడానికి రూ.వెయ్యి కోట్లు ఖర్చు పెట్టారు. రంగుల పిచ్చిలో దాదాపు 2 వేల కోట్లు దుబారా చేసిందని జనసేన అధినేత ఆయన విమర్శించారు. అందులో రూ.220 కోట్లు వెచ్చిస్తే తోటపల్లి రిజర్వాయర్‌ ఎడమ కాలువ పూర్తయ్యేదన్నారు.

పాలకొండ డివిజన్‌లో ఏనుగుల బెడద అధికంగా ఉందని.. ఆస్తి , ప్రాణ నష్టం వాటిల్లుతుందన్నారు. అధికారంలోకి వచ్చాక గజరాజులతో జరిగిన నష్టానికి పరిహారం అందిస్తామని పవన్ హమీ ఇచ్చారు. డిజిటల్ హెల్త్ కార్డ్స్ అందిస్తామన్నారు.పదవీ విరమణ తరువాత ఉద్యోగులు భయపడకూడదని.. సీపీఎస్ లేదా తత్సమాన పరిష్కారం అందిస్తామన్నారు. ఉద్యోగులను అన్నివిధాలా ఆదుకుంటామన్నారు. ప్రతి ఇంటికి రక్షిత మంచినీరు అందిస్తామన్నారు.

ఉద్దానం కిడ్నీ సమష్యలకు సంపుర్ణ పరిష్కారం వచ్చేంత వరకూ కృషి చేస్తామన్నారు. జగన్‌కు ఒక్క ఛాన్స్ ఇచ్చారు సరిపోదా అంటూ ఆయన ఎద్దేవా చేశారు. ఉమ్మడి కూటమి ప్రభుత్వాన్ని తీసుకురావాలని ప్రజలను కోరారు. పాలకొండను బంగారుకొండ చేసుకుంటామన్నారు. దశాబ్దం తరువాత ఆభ్యర్థిస్తున్నా , అర్థిస్తున్నా , కూటమి అభ్యర్దులను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement