Wednesday, May 8, 2024

మేం మాట్లాడితే బీజేపీకి ఎందుకు నొప్పి అని ప్రశ్న

కేంద్ర ప్రభుత్వంపై మరోసారి తెలంగాణ మంత్రి కేటీఆర్ విరుచుకుపడ్డారు. భవిష్యత్‌లో రాష్ట్ర ప్రభుత్వాలను కూడా కేంద్రంలోని బీజేపీ సర్కారు ప్రైవేటీకరణ చేస్తుందేమోనని ఎద్దేవా చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ దేశంలోనే ఉందని, దానిపై మేం ఎందుకు మాట్లాడకూడదని ప్రశ్నించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులకు కష్టం వస్తే తాము స్పందించామని.. అయినా తాము మాట్లాడితే బీజేపీ ఎందుకు నొప్పి వస్తోందని నిలదీశారు. ఏపీకి కష్టం వచ్చిందని మేం నోరుమెదపకుంటే ఎలా అన్న ఆయన.. మనకు కష్టం వస్తే ఎవరు వస్తారని కేటీఆర్ అన్నారు. తెలంగాణలోని సింగరేణిని ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటీకరణ చేయనివ్వం అని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. బీజేపీకి ఓటు వేస్తే దేశంలో పెరిగిన ధరలను సమర్ధించడమేనని కేటీఆర్ అన్నారు. బీజేపీ నేతల జాతీయవాదంలో తెలంగాణ జాతి ప్రయోజనాలు లేవా అని ప్రశ్నించారు. దేశంలో 14 శాతం పీఆర్సీ ఇచ్చిన బీజేపీ.. రాష్ట్రంలో 43 శాతం పీఆర్సీ ఇచ్చిన టీఆర్ఎస్‌ను విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు. వీసీల నియామకంలో బీజేపీలా తాము రాజకీయాలు చేయలేదని పేర్కొన్నారు. రోహిత్ వేముల లాంటి విద్యార్థి చావుకు టీఆర్ఎస్ పార్టీ కారణం కాలేదని పరోక్షంగా బీజేపీని విమర్శించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement