Wednesday, May 15, 2024

వైసిపి కేంద్ర కార్యాల‌యంలో ఘ‌నంగా పార్టీ ఆవిర్భావ దినోత్స‌వ వేడుక‌లు..

అమ‌రావ‌తి: వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్స‌వ వేడుక‌లు రాష్ట్రవ్యాప్తంగా పండుగ‌లా నిర్వ‌హిస్తున్నారు. వాడ‌వాడ‌లా, ఊరూరా వైయ‌స్ఆర్ ‌సీపీ 11వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘ‌నంగా నిర్వహిస్తున్నారు. తాడేప‌ల్లిలోని వైయ‌స్ఆర్ సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రి బొత్స‌స‌త్య‌నారాయ‌ణ‌.. పార్టీ జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా దివంగ‌త మ‌హానేత వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి విగ్ర‌హానికి పూల‌మాల‌లు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌, ఎమ్మెల్యే జోగి రమేష్, ఎంపీ సురేష్, పార్టీ నేత‌లు లేళ్ల అప్పిరెడ్డి, చ‌ల్లా మ‌ధుసూద‌న్‌రెడ్డి, నంద‌మూరి ల‌క్ష్మీపార్వ‌తి, ప‌ద్మ‌జా, క‌డ‌ప ర‌త్నాక‌ర్‌, త‌దిత‌రులు పాల్గొన్నారు.
వైయ‌స్ఆర్ స్మృతివ‌నంలో..
క‌ర్నూలు జిల్లా న‌ల్ల‌కాల్వ‌లోని మ‌హానేత వైయ‌స్ రాజ‌శేఖర‌రెడ్డి ‌స్మృతివ‌నంలో శ్రీ‌శైలం ఎమ్మెల్యే శిల్పా చ‌క్ర‌పాణిరెడ్డి ఆధ్వ‌ర్యంలో పార్టీ ఆవిర్భావ వేడుక‌లు ఘ‌నంగా నిర్వ‌హించారు. మ‌హానేత వైయ‌స్ఆర్ విగ్ర‌హానికి పూల‌మాల‌లు వేసి నివాళుల‌ర్పించారు.
పులివెందుల‌లో..
వైయ‌స్ఆర్ జిల్లా పులివెందులలో వైయ‌స్సార్‌సీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వైయ‌స్సార్‌ ఆడిటోరియం వద్ద పార్టీ జెండాను ఎంపీ వైయ‌స్ అవినాష్‌రెడ్డి, వైయ‌స్ మనోహర్‌రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం కేక్ కట్ చేశారు.
కృష్ణా జిల్లాలో..
కృష్ణా జిల్లాలో వైయ‌స్ఆర్ సీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా విజయవాడ పోరంకి సెంటర్‌లో పార్టీ జెండా ఎగురవేశారు. అనంతరం ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి కేక్‌ కట్‌ చేశారు. ఈ కార్యక్రమంలో పెద్దఎత్తున పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
తిరుప‌తిలో..
చిత్తూరు జిల్లా తిరుపతిలో వైయ‌స్సార్‌సీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి.. పార్టీ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ, వైయ‌స్సార్‌సీపీ జెండా జనం గుండెల్లో నిలిచిపోయిందన్నారు. ఇచ్చిన హామీలన్నీ అమలు చేసి సీఎం వైయ‌స్‌ జగన్.. ప్రజల మన్ననలు పొందారన్నారు. కొత్త పాలక వర్గాలతో మరిన్ని అభివృద్ధి పనులు చేస్తామన్నారు. సంక్షేమం, అభివృద్ధే వైయ‌స్సార్‌సీపీ లక్ష్యమన్నారు.
విశాఖ‌లో..
విశాఖపట్నం నగర కార్యాలయంలో వైయ‌స్సార్‌ సీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే అదీప్ రాజు, పార్టీ నగర అధ్యక్షుడు వంశీ కృష్ణ .. పార్టీగ జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో కేకే రాజు, మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు, రెహమాన్, తైనాల విజయ కుమార్, చొక్కాకుల వెంకటరావు, చింతలపూడి వెంకట రామయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అదీప్‌ రాజు మాట్లాడుతూ, ప్రజల సంక్షేమం కోసం వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి పార్టీని స్థాపించారని తెలిపారు. వైయ‌స్‌ జగన్‌ను సోనియాగాంధీ, చంద్రబాబు కుమ్మకై ఎన్నో ఇబ్బందులకు గురిచేశారన్నారు.వారి కుట్రలను సీఎం వైయ‌స్ జగన్‌ ధైర్యంగా ఎదుర్కొన్నారన్నారు.
అనంత‌పురం జిల్లాలో..
అనంత‌పురం జిల్లాలో వైయ‌స్ఆర్‌‌సీపీ ఆవిర్భావ దినోత్స‌వ వేడుక‌లు ఘ‌నంగా నిర్వ‌హించారు. న‌గ‌రంలో ఎమ్మెల్యే అనంత వెంక‌ట్రామిరెడ్డి, త‌దిత‌రులు జెండా ఆవిష్క‌రించి కేక్ క‌ట్ చేశారు.
ప్ర‌కాశం జిల్లాలో..
ప్రజా క్షేత్రంలో పురుడు పోసుకున్న వైయ‌స్సార్‌సీపీ 11వ వసంతంలోకి అడుగు పెట్టిన సంద‌ర్భంగా ప్ర‌కాశం జిల్లాలోని అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో అవిర్భావ దినోత్స‌వ వేడుక‌లు ఘ‌నంగా నిర్వ‌హించారు. మంత్రి బాలినేని శ్రీ‌నివాస‌రెడ్డి పార్టీ కార్యాల‌యం వ‌ద్ద మ‌హానేత విగ్ర‌హానికి నివాళుల‌ర్పించి, పార్టీ జెండాను ఆవిష్క‌రించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement