Saturday, May 25, 2024

మహారాష్ట్రకు విశాఖ ట్యాంకర్లు.. ఆక్సిజన్ నింపుకొని రవాణా!

మహారాష్ట్రలో కరోనా విజృంభణ మరింత ఆందోళన కలిగిస్తోంది. గత కొన్ని రోజులుగా 50 వేలకు తక్కువ కాకుండా కొత్త కేసులు నమోదవుతున్నాయి. అంతేస్థాయిలో వందల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. దీంతో చికిత్స అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులను అందుబాటులోకి తీసుకువచ్చింది. మరోవైపు మహారాష్ట్రలో కరోనాను కట్టడి చేయడానికి అవసరమైన ఆక్సిజన్‌ ట్యాంకర్లు విశాఖపట్నం నుంచి వెళుతున్నాయి. విశాఖ నుంచి భిలాయ్‌ స్టీల్‌ప్లాంటుకు వెళ్లి, అక్కడ లిక్విడ్‌ ఆక్సిజన్‌ను నింపుకొని అటు నుంచి మహారాష్ట్ర పంపుతున్నారు. భిలాయ్‌లో ట్యాంకర్ల కొరత ఏర్పడటంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం జిల్లా అధికారులతో మాట్లాడి, ఖాళీ ట్యాంకర్లు పంపాలని కోరింది. దీంతో ట్యాంకర్‌ ఆపరేటర్లతో అధికారులు సంప్రదించి ఇక్కడి నుంచి పంపుతున్నారు.

గతేడాది కరోనా ప్రబలినప్పుడు ఉభయ తెలుగు రాష్ట్రాలకు అవసరమైన ఆక్సిజన్‌ను విశాఖలో స్టీల్‌ప్లాంట్‌లోనే ఉత్పత్తి చేశారు. రోజుకు 100 నుంచి 200 టన్నుల వరకూ మార్కెట్‌ ధర కంటే తక్కువకే సరఫరా చేశారు. ఆ సమయంలో స్థానికంగా ఉన్న ట్రాన్స్‌ పోర్టు వ్యాపారులు ఈ ట్యాంకర్లను సమకూర్చుకున్నారు. ఇప్పుడు కరోనా తీవ్రత ఎక్కువగా ఉండటంతో విశాఖపట్నం కలెక్టర్‌ వినయ్‌ చంద్‌ తో మహారాష్ట్ర అధికారులు మాట్లాడారు. శుక్రవారమే కొన్ని ఖాళీ ట్యాంకర్లు భిలాయ్‌ వెళ్లాయి. కాగా, విశాఖలోని ఏపీ మెడ్‌ టెక్‌ జోన్‌లో పెద్దఎత్తున వెంటిలేటర్లు తయారు చేస్తున్నారు. వాటిని కూడా మహారాష్ట్రకు ప్రత్యేకంగా పంపుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement