Wednesday, May 8, 2024

రాహుల్ పై వేటు.. ప్ర‌జాస్వామ్య చ‌రిత్ర‌లో చీక‌టి రోజు.. కేసీఆర్

కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై అన‌ర్హ‌త వేటు వేయ‌డాన్ని బీఆర్ఎస్ అధినేత‌, ముఖ్య‌మంత్రి కేసీఆర్ తీవ్రంగా ఖండించారు. నేడు భారతదేశ ప్రజాస్వామ్య చరిత్రలో చీకటిరోజు అన్నారు. ప్ర‌ధాని మోడీ పాల‌న ఎమ‌ర్జెన్సీ ని మించిపోతుంద‌ని కేసీఆర్ మండిప‌డ్డారు. నేర‌స్తులు, ద‌గాకోరుల కోసం ప్ర‌తిప‌క్ష నాయ‌కుల‌పై అన‌ర్హ‌త వేటు వేసి మోడీ ప‌త‌నాన్ని కొని తెచ్చుకుంటున్నార‌ని కేసీఆర్ తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. రాహుల్‌పై అన‌ర్హ‌త వేటు వేయ‌డంపై కేసీఆర్ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు.


భారతదేశ ప్రజాస్వామ్య చరిత్రలో నేడు చీకటిరోజు. రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యత్వంపై అనర్హత వేటు వేయడం నరేంద్రమోడీ, నియంతృత్వానికి పరాకాష్ట. రాజ్యాంగబద్ద సంస్థలను దురుపయోగం చేయడమే కాకుండా అత్యున్నత ప్రజాస్వామ్య వేదిక అయిన పార్లమెంటును సైతం తమ హేయమైన చర్యలకోసం మోడీ ప్రభుత్వం వినియోగించుకోవడం గర్హనీయం. ప్రజాస్వామ్యానికి రాజ్యాంగ విలువలకు చేటుకాలం దాపురించింది. మోడీ పాలన ఎమర్జన్సీని మించిపోతున్నది. ప్రతిపక్ష నాయకులను వేధించడం పరిపాటిగా మారిపోయింది. నేరస్థులు, దగాకోరుల కొసం ప్రతిపక్ష నాయకులపై అనర్హత వేటు వేసి మోడీ పతనాన్ని కొనితెచ్చుకుంటున్నారు. పార్టీల మధ్య వుండే వైరుధ్యాలకు ఇది సందర్భం కాదు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ విలువలను కాపాడుకోవడం కోసం బీజేపీ ప్రభుత్వ దుశ్చర్యను ప్రజాస్వామ్యవాదులందరూ ముక్త కంఠంతో ఖండించాలి. బీజేపీ దుర్మార్గ విధానాలను ప్రతిఘటించాలి అని కేసీఆర్ పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement