Sunday, May 12, 2024

ఒక పక్క కేసులు.. మరో పక్క క్లాసులు.. పట్టించుకోని ఏపీ

ఆంధ్రప్రదేశ్‌లోని పాఠశాలల్లో కరోనా పాజిటివ్ కేసులు కలకలం రేపుతున్నాయి. గుంటూరు జిల్లా ఈపూరు మోడల్ స్కూల్‌లో ఐదుగురు 6వ తరగతి విద్యార్థినులకు కరోనా సోకింది. వారిని ఇంటికి పంపి, మిగతా వారికి క్లాసులు నిర్వహిస్తున్నారు. అటు అనంతపురం జిల్లా బుక్కపట్నం బాలికల పాఠశాలలో ఆరుగురు పదో తరగతి విద్యార్థులకు పాజిటివ్ వచ్చింది. కృష్ణా జిల్లా గొట్టిముక్కల జెడ్పీ హైస్కూల్, పడమట కేబీసీ పాఠశాల, నెల్లూరు జిల్లా ఆదూరుపల్లిలో కరోనా కేసులు నమోదయ్యాయి.

ఏపీలోని స్కూళ్లలో ఇంత జరుగుతున్నా ప్రభుత్వంలో చలనం ఏ మాత్రం లేదు. విద్యార్థులు కరోనా కారియర్లుగా మారి.. తల్లిదండ్రులకు, ముసలివాళ్లకు కరోనా అంటించే ప్రమాదముంది. ఇక పరీక్షల వాయిదా ఉండదని, తప్పకుండా ఉంటాయని సర్కారు చెబుతోంది. ఈ నిర్ణయంపై విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి వ్యతిరేకత వస్తోంది. కరోనా తగ్గే వరకు పరీక్షలు వాయిదా వేయాలని కోరుతున్నారు. పొరుగు రాష్ట్రమైన తెలంగాణలో మెడికల్ కాలేజీలు తప్ప మిగిలిన విద్యాసంస్థలన్నీ మూసివేశారు. మళ్లీ ప్రభుత్వం చెప్పేవరకు విద్యాసంస్థలు తెరవొద్దని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలిచ్చింది. ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మాత్రం ఏపీలో స్కూళ్లను మూసివేసే ఆలోచన లేదని గతంలో స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement