Friday, April 26, 2024

టీ-20ల్లో అరుదైన రికార్డు నెలకొల్పిన క్రిస్ గేల్

యూనివర్సల్ బాస్, వెస్టిండీస్ విధ్వంసక ఆటగాడు క్రిస్ గేల్ మరో అరుదైన రికార్డును అందుకున్నాడు. టీ-20 ఫార్మాట్‌లో 14వేల పరుగులు చేసిన తొలి ఆటగాడిగా గేల్ చరిత్ర సృష్టించాడు. ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టీ-20లో ఈ మైలురాయిని అందుకున్నాడు. అటు ఈ మ్యాచ్‌లో గేల్ (67రన్స్ 38బంతుల్లో 4X4, 7X6) విరుచుకు పడటంతో 142 పరుగుల టార్గెట్‌ను ఉఫ్ మని ఊదేసి విండీస్ ఘనవిజయం అందుకుంది. దీంతో మరో రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే ఐదు టీ-20ల సిరీస్‌ను వెస్టిండీస్ 3-0తో సొంతం చేసుకుంది. కాగా విండీస్ తరుఫున గేల్ ఐదేళ్ల తర్వాత అర్ధసెంచరీ సాధించడం విశేషం.

అంతకముందు తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆస్ట్రేలియా విండీస్‌ బౌలర్ల కట్టుదిట్టమైన బౌలింగ్‌ కారణంగా 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసింది. ఆసీస్‌ బ్యాటింగ్‌లో హెన్రిక్స్‌ 33, కెప్టెన్‌ ఆరోన్‌ ఫించ్‌ 30 పరుగులు చేశారు. విండీస్‌ బౌలర్లలో షెల్డన్‌ కాట్రెల్‌ 3, ఆండీ రసెల్‌ 2 వికెట్లు తీశారు. కాగా సిరీస్‌లో నామమాత్రంగా మారిన మిగిలిన రెండు మ్యాచ్‌లు జూలై 14, 16న జరగనున్నాయి. ఆ తర్వాత ఇరు జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్‌ జరగనుంది.

ఈ వార్త కూడా చదవండి: కోహ్లీ ఐసీసీ ట్రోఫీనే కాదు.. ఐపీఎల్ టైటిల్ కూడా గెలవలేదు: రైనా

Advertisement

తాజా వార్తలు

Advertisement