Saturday, April 27, 2024

హీరో సాయిధరమ్‌ తేజ్‌కు రోడ్డు ప్రమాదం.. తీవ్రగాయాలు

మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు మెగా హీరో సాయిధరమ్‌ తేజ్‌ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. శుక్రవారం స్పోర్ట్స్‌ బైక్‌పై ప్రయాణిస్తున్న ఆయన ప్రమాదవశాత్తూ కిందపడిపోయారు. ఈ ఘటనలో సాయిధరమ్‌ తేజ్‌కు తీవ్రగాయాలు అయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే సాయితేజ్‌ అపస్మారక స్థితిలో వెళ్లినట్లు తెలుస్తోంది. నగరంలోని కేబుల్‌ బ్రిడ్జ్‌-ఐకియా సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఘటన గురించి తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ప్రమాద ప్రాంతానికి చేరుకుని, చికిత్స నిమిత్తం సాయిధరమ్‌ తేజ్‌ను ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.

ప్రస్తుతం ఆయనకు చికిత్స కొనసాగుతోంది. బైక్‌పై వేగంగా వెళ్లడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. బైక్‌ను నియంత్రించలేక అదుపుతప్పి కిందపడిపోయినట్లు మాదాపూర్‌ సీఐ తెలిపారు. అంతర్గతంగా ఏమైనా గాయాలు అయ్యాయా? అన్న అనుమానంతో సాయిధరమ్‌ తేజ్‌కు వైద్యులు స్కాన్‌ చేస్తున్నారని, ప్రమాద వార్తను కుటుంబ సభ్యులకు తెలియజేసినట్లు తెలిపారు వివరించారు.

సాయిధరమ్ తేజ్‌ కోలుకుంటున్నట్లు వైద్యులు తెలిపారు. ఆందోళన చెందవద్దని కుటుంబ సభ్యులకు చెప్పారు. మెడికవర్‌ ఆస్పత్రికి సాయిధరమ్‌ తేజ్‌ కుటుంబసభ్యులు చేరుకున్నారు. చిరంజీవి, పవన్‌కల్యాణ్‌, అల్లు అరవింద్‌ ఆస్పత్రికి చేరుకొని తేజ్​ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement