Wednesday, May 8, 2024

IPL : క్రికెట్ బేస్ బాల్ గా మారింది..

చిన్న మైదానాలు, తేమ ప్రభావంతో క్రికెట్ కాస్త బేస్ బాల్‌గా మారిందని పంజాబ్ కింగ్స్ తాత్కలిక సారథి సామ్ కరణ్ తెలిపాడు. ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా కోల్‌కతా నైట్‌రైడర్స్(కేకేఆర్)తో ఈడెన్ గార్డెన్స్ వేదికగా శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్ అనంతరం తమ విజయంపై స్పందించిన సామ్ కరణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘ఈ విజయం మాకు చాలా ముఖ్యం.

చాలా సంతోషంగా ఉంది. క్రికెట్ కాస్త బేస్ బాల్‌గా మారిపోయింది. గత కొన్ని వారాలు మాకు కఠినంగా గడిచాయి. కానీ మేం సరైన పరిస్థితుల్లో పుంజుకున్నాం. మా కుర్రాళ్లు కూడా చాలా కష్టపడ్డారు.
మేం పుంజుకోవడానికి కోచ్‌లు కూడా కీలక పాత్ర పోషించారు. చిన్న మైదానాలు, తేమ ప్రభావంతో బ్యాటర్లు చెలరేగుతున్నారు. రివ్యూలతో కూడా ఎక్స్‌ట్రా బాల్ వేయాల్సి వస్తుంది. కొన్ని బంతులు మిగిలి ఉండగానే భారీ లక్ష్యాన్ని చేధించడం సంతోషంగా ఉంది.

- Advertisement -

ఈ ఓట‌మి మాకో గుణ‌పాఠం…

పంజాబ్ కింగ్స్ చేతిలో ఎదురైన ఓటమి తమ జట్టుకు ఓ గుణపాఠమని కోల్‌కతా నైట్‌రైడర్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తెలిపాడు.
ఈ ఓటమి చాలా ఆశ్చర్యంగా ఉందని తెలిపాడు. 262 పరుగుల భారీ లక్ష్యాన్ని డిఫెండ్ చేసుకోకపోవడం నిరాశకు గురిచేసిందన్నాడు. ఎక్కడ తప్పు చేశామో కూడా అర్థం కావడం లేదని చెప్పాడు. ‘ఇరు జట్ల బ్యాటర్లు అసాధారణ ప్రదర్శన కనబర్చారు. కళ్లు చెదిరే బ్యాటింగ్‌తో చెలరేగారు. సునీల్ నరైన్, ఫిల్ సాల్ట్ బ్యాటింగ్ కనువిందు చేసింది. పంజాబ్ కింగ్స్ బ్యాటర్లు సైతం అద్భుతంగా ఆడారు. ఈ మ్యాచ్‌లో ఎక్కడ తప్పిదం చేశామో అర్థం కావడం లేదు. 260 పరుగులను కాపాడులేకపోవడం ఆశ్చర్యంగా ఉంది. బాధగా ఉంది. డ్రాయింగ్ బోర్డ్‌పైనే తప్పిదాలు తెలుసుకోవాలి. ఈ పరాజయం మాకు ఓ గుణపాఠం. మేం పిచ్ కండిషన్స్‌కు తగ్గట్లు వ్యూహాలు రచించాల్సి ఉంది. బంతిని నరైన్ కొట్టిన విధానం అద్భుతంగా ఉంది. అతను ఇదే జోరును కొనసాగిస్తాడని ఆశిస్తున్నా. మా జట్టుకు అతను అత్యంత కీలమైన ఆటగాడు.’అని శ్రేయస్ అయ్యర్ చెప్పుకొచ్చాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement