Friday, April 26, 2024

చదువుకున్న మహిళల్లో రెండు నాలుకల ధోరణి: జయా బచ్చన్‌

మహిళలకు మహిళలే శత్రువులని, చదువుకున్న మహిళలు ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నారని బాలీవుడ్‌ సీనియర్‌ నటి, సమాజ్‌వాదీ పార్టీ నేత జయా బచ్చన్‌ అన్నారు. ఆమె ఇటీవల తన మనుమరాలు నవ్య నవేలీ నంద పాడ్‌కాస్ట్‌ ఎపిసోడ్‌లో ఈ వ్యాఖ్యలు చేశారు. కుమార్తెలను పెంచినట్లుగానే కుమారులను కూడా పెంచాలన్న వ్యాఖ్యలకు ఆమె ఈ విధంగా స్పందించారు. జయా బచ్చన్‌, ఆమె కుమార్తె శ్వేత బచ్చన్‌, మనుమరాలు నవ్య నవేలీ నంద పిల్లల పెంపకం గురించి మాట్లాడారు. నవ్య మాట్లాడుతూ, తల్లిదండ్రులు తమ కుమార్తెలను పెంచినట్లుగానే కుమారులను కూడా పెంచాలని చెప్పారు. జయ జోక్యం చేసుకుని చదువుకున్న మహిళలు కూడా ద్వంద్వ ప్రమాణాలను పాటిస్తున్నారన్నారు.

ఇది చాలా శోచనీయమని చెప్పారు. ఈ విషయాన్ని చెప్పాలని చాలాసార్లు అనుకున్నానని, అయితే బాగుండదని చెప్పలేదని చెప్పారు. ఆడదానికి ఆడదే శత్రువు అన్నారు. శ్వేత మాట్లాడుతూ, తన తల్లి తన పట్ల అంత బాగా వ్యవహ‌రించరని చెప్పారు. మహిళలు తమ తోటి మహిళలతో మంచిగా ఉండాలన్నారు. సహకారం అందించే విధంగా ఉండాలన్నారు. దీనిపై జయా బచ్చన్‌ స్పందిస్తూ, నవ్యకు తాను చాలా మంచిదాన్నని చెప్పారు. తాను ఎల్లప్పుడూ మహిళలకు సహాయపడుతూనే ఉంటానని, వారి తరపున గళమెత్తుతానని చెప్పారు. తల్లికూతుళ్ళ గురించి మాట్లాడుకోవద్దన్నారు. మెడిలీన్‌ కే అల్‌బ్రైట్‌ కోట్‌ను శ్వేత ప్రస్తావించారు. ఇతర మహిళలకు సహాయపడని మహిళలకు నరకంలో ప్రత్యేకంగా ఓ ప్రదేశం ఉంటుందని మెడిలీన్‌ చెప్పారన్నారు. దాతృత్వం ఇంటి నుంచే, తల్లి నుంచే ప్రారంభం కావాలని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement