Friday, April 26, 2024

30మందికి జీవిత ఖైదు.. 11 ఏళ్ల నాటి కేసులో కోర్టు తీర్పు, 49 మంది నిర్దోషులుగా విడుదల

రాజస్థాన్‌లోని సవాయ్‌ మధోపూర్‌లో 2011లో జరిగిన మతపరమైన అల్లర్ల కేసులో అడిషనల్‌ సెషన్స్‌ కోర్టు 30 మందికి జీవిత ఖైదు విధించింది. వీళ్లలో మహీందర్‌ సింగ్‌ తన్వర్‌ అనే డీఎస్పీ కూడా ఉన్నారు. ఫూల్‌ మొహమ్మద్‌ ఖాన్‌ అనే ఎస్‌హెచ్‌వో (స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌)ను సజీవంగా దహనం చేసిన కేసులో వీళ్లకు కోర్టు శనివారం జీవిత ఖైదు విధించింది. వీళ్లలో కొందరిని రూ. 2,000 నుంచి రూ. 50,000 వరకు జరిమానా చెల్లించాల్సిందిగా కోర్టు ఆదేశించింది. మొహమ్మద్‌ ఖాన్‌ మాన్‌టౌన్‌ పోలీస్టేషన్‌లో ఎస్‌హెచ్‌వోగా పనిచేసేవాడు. 2011 జూన్‌లో మతపరమైన అల్లర్లు చెలరేగినప్పుడు అతను తీవ్రంగా గాయపడ్డాడు.

అల్లరి మూకల నుంచి ప్రాణాలు కాపాడుకునేందుకు తన వాహనంలో దాక్కున్నాడు. కానీ, కొందరు ఆ వాహనాన్ని చుట్టుముట్టి నిప్పు పెట్టారు. దాంతో, అతను సజీవంగా అగ్నికి ఆహుతి అయ్యాడు. మొదట్లో ఈ కేసుని సీఐడీ చేపట్టింది. అయితే, రాజస్థాన్‌ ప్రభుత్వం కోరిక మేరకు సీబీఐ దర్యాప్తు చేసింది. ఈ కేసులో 79మందిని విచారించిన అడిషనల్‌ సెషన్స్‌ కోర్టు 30 మందిని దోషులుగా తేల్చింది. 49 మందిని నిర్దోషులుగా ప్రకటించింది.మొహమ్మద్‌ ఖాన్‌ మీద వ్యక్తిగత కక్షతోనే డీఎస్పీ మహీందర్‌ సింగ్‌ అతడిని చంపాలనుకున్నాడు. అందుకోసం అల్లర్ల సమయంలో మరో నిందితుడితో కలిసి కుట్ర పన్నాడు. కొంతమందిని రెచ్చగొట్టి, మొహమ్మద్‌ ఖాన్‌ని వెంబడించేలా చేశాడు. అతను కారులో తలదాచుకున్న విషయం తెలిసి, ఆ కారుకు నిప్పు పెట్టించాడని సీబీఐ అన అభియోగ పత్రంలో తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement