Sunday, May 19, 2024

ఆయిల్‌ సాగు.. భలే బాగు.. తక్కువ పెట్టుబడితో అధిక లాభం పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం

సిద్దిపేట, (ప్రభ న్యూస్‌) : ఆయిల్‌ ఫామ్‌ సాగుకు రైతులకు ప్రోత్సహించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తున్నాది. కేంద్ర ప్రభుత్వం అందజేస్తున్న సబ్సీడీకి అదనంగా తాను కూడా కొంత మొత్తం ఇవ్వాలని నిర్ణయించింది. ఆయిల్‌ ఫామ్‌ సాగు కోసం కేంద్ర ప్రభుత్వం నాలుగేళ్లలో రూ.2.70 లక్షలు సబ్సీడీ ఇవ్వనున్నది. దీనికి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం రూ.30 వేలు సబ్సీడీ ఇస్తుంది. సబ్సీడీపై డ్రిప్‌ పరికరాలను అందజేయనున్నది. ఎకరా విస్తేర్ణంలో పంట సాగుకు మొత్తం రూ.4 లక్షలుపెట్టుబడి అవసరమవుతుంది. దీనిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి ప్రతి ఏటా రూ.లక్ష సబ్సీడీ రూపంలో అందజేయనున్నాయి. మిగిలిన పెట్టుబడి భారం కూడా రైతుపై పడకుండా నాలుగేళ్ల తరువాత చెల్లించేలా బ్యాంకుల నుంచి రుణం ఇప్పించేందుకు కార్యాచరణను రూపొందించింది. ఒక్కసారి పంట వేసుకుంటే 30 సంవత్సరాల దాకా రైతుకు నిరంతరం దిగుబడి వస్తుంది. సిద్దిపేట జిల్లాలో 3,100 ఎకరాలలో ఆయిల్‌ ఫామ్‌ సాగుచేస్తారని అంచనా. ఆయిల్‌ ఫామ్‌ సాగుకు ఇప్పటికే 2,300 రైతులను ఎంపిక చేసినట్లు, 2,200 ఎకరాలలో ఆయిల్‌ ఫామ్‌ మొక్కలు ఇప్పటికే నాటినట్లు జిల్లా ఉద్యానవన, పట్టు పరిశ్రమ శాఖ అధికారి రామలక్ష్మి తెలిపారు. సిద్ది పేట జిల్లా నారాయణరావుపేట మండలం గోపాలపూర్‌కి చెందిన రైతులు ఆయిల్‌ ఫామ్‌ సాగులో మెళకువలు తెలుసుకునేందుకు ఖమ్మం జిల్లా అశ్వావుపేటలో తోటలను సందర్శించడం జరిగింది.

మంత్రి హరీష్‌ రావు చొరవతో ఫ్యాక్టరీ..

మంత్రి హరీష్‌ రావు చొరవతో సిద్దిపేటలోనే ఫామ్‌ ఆయిల్‌ తయారు చేసే ఫ్యాక్టరీ మంజూరయ్యింది. సిద్దిపేటతో పాటు మహబూబాబాద్‌, జనగాం జిల్లాల రైతుల ప్రయోజనం కోసం తెలంగాణ స్టేట్‌ కో ఆపరేటివ్‌ ఆయిల్‌ సీడ్స్‌ లిమిటెడ్‌ కంపెనీ ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. నాలుగేళ్లలో ఈ ఫ్యాక్టరీ రైతులకు అందుబాటులోకి రానున్నది. మెక్కలు ఇవ్వడం మొదలుకొని చెట్లు నాటడం, ఎరువుల వాడకం, క్రాప్‌ కటింగ్‌, మార్కెటింగ్‌ ఇలా అన్ని విషయాల్లోనూ రైతులకు ఈ కంపెనీ అండగా ఉంటుంది. పంట చేతికొచ్చిన అనతరం ఈ కంపెనీయే కొనుగోలు చేస్తుంది. ప్రతి 15 రోజులకోసారి పంటను కోసి కంపెనీకి తరలిస్తారు. నేరుగా రైతు బ్యాంకు ఖాతాలో డబ్బును జమచేస్తారు. జిల్లాలో రైతులను వాణిజ్య పంట అయిన ఆయిల్‌ ఫామ్‌ వైపు మళ్లించేందుకు మంత్రి హరీష్‌ రావు ప్రత్యేక దృషి సారించారు. రైతుల కోసం అవగాహన సదస్సు కూడా నిర్వహించి వారిని వాణిజ్య పంటల వైపు మళ్లించడంలో తనవంతు కృషి చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement