ఏపీ విభజనపై ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు తెలంగాణలో కాక పుట్టిస్తున్నాయి. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై రాజ్యసభలో మోదీ ప్రసంగిస్తూ కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించారు. పార్లమెంటులో మైకులు ఆపేసి, చర్చ లేకుండానే ఏపీని కాంగ్రెస్ విభజించిందని విమర్శించారు. ఈ వ్యాఖ్యలపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఎక్కడికక్కడ మోదీ దిష్టి బొమ్మలను కాలబెట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పిన మోదీ మోసం చేశారని రేవంత్ విమర్శించారు. బీజేపీ సీనియర్లను మోసం చేసి మోదీ ప్రధాని అయ్యారని అన్నారు. ఒక ఓటుకు రెండు రాష్ట్రాలు అంటూ తెలంగాణలో బీజేపీ ప్రచారం చేసుకోలేదా? అని ప్రశ్నించారు. మూడు రాష్ట్రాలను ఏర్పాటు చేసిన వాజ్ పేయి.. తెలంగాణకు మాత్రం మొండి చేయి చూపించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పట్లోనే తెలంగాణను ఇచ్చి ఉంటే వందలాది మంది ప్రాణాలు పోయేవి కాదన్నారు రేవంత్. ఏపీ నేతలు ఎంతో ఒత్తిడి చేసినా సోనియాగాంధీ తెలంగాణను ఇచ్చారని అన్నారు. ఒక రాష్ట్రంలో పూర్తిగా నష్టపోతామని తెలిసినా తెలంగాణను ఇచ్చారని చెప్పారు.