Wednesday, May 8, 2024

ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్‌కు అస్వస్థత

మహారాష్ట్ర: సీనియ‌ర్ రాజ‌కీయ నేత, నేష‌నల్ కాన్ఫ‌రెన్స్ పార్టీ అధ్యక్షుడు శ‌ర‌ద్‌ప‌వార్ స్వ‌ల్ప అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు. క‌డుపులో నొప్పిగా ఉంద‌ని చెప్ప‌డంతో కుటుంబ‌స‌భ్యులు ఆయ‌న‌ను ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. అక్క‌డ ప‌వార్‌కు అన్ని ర‌కాల ప‌రీక్ష‌లు చేసిన వైద్యులు మూత్రాశ‌యంలో స‌మ‌స్య ఉన్న‌ట్లు నిర్ధారించారు. ఈ విష‌యాన్ని ఎన్సీపీ నేత న‌వాబ్ మాలిక్ మీడియాకు వెల్ల‌డించారు. స‌మ‌స్య చిన్న‌దేన‌ని, ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం ఏమీ లేద‌ని వైద్యులు చెప్పిన‌ట్లు తెలిపారు.

అయితే శ‌ర‌ద్‌ప‌వార్‌కు బ్ల‌డ్ థిన్నింగ్ స‌మ‌స్య ఉండేద‌ని, అందుకు సంబంధించి ఆయ‌న కొద్ది రోజులుగా చికిత్స తీసుకుంటున్నార‌ని, ప్ర‌స్తుతం మూత్రాశ‌యం స‌మ‌స్య కార‌ణంగా ఆ ట్రీట్‌మెంట్‌ను నిలిపి వేస్తున్న‌ట్లు వైద్యులు చెప్పార‌ని న‌వాబ్ మాలిక్ పేర్కొన్నారు. మార్చి 31న ప‌వార్ తిరిగి ఆస్ప‌త్రిలో అడ్మిట్ అవుతార‌ని, ఆ రోజు వైద్యులు ఆయ‌న‌కు ఎండోస్కోపి నిర్వ‌హించి మైన‌ర్ స‌ర్జ‌రీ చేయ‌నున్నార‌ని చెప్పారు. అనారోగ్యం కార‌ణంగా ప‌వార్ హాజ‌రుకావాల్సిన అన్ని కార్య‌క్ర‌మాల‌ను ర‌ద్దు చేసిన‌ట్లు నవాబ్ మాలిక్ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement