Saturday, April 27, 2024

రికార్డుస్థాయిలో జీఎస్టీ వసూళ్లు, రూ.1.42లక్షల కోట్ల రాబడి

2021-2022 ఆర్థిక సంవత్సరం చివరి నెలలో రికార్డు స్థాయిలో జీఎస్టీ వసూలు అయింది. మార్చిలో గూడ్స్‌ అండ్‌ సర్వీస్‌ ట్యాక్స్‌ (జీఎస్టీ) రూ.1.42 లక్షల కోట్లుగా నమోదైంది. కొత్త పన్ను విధానం అమలులోకి వచ్చిన తర్వాత ఇంత పెద్ద మొత్తంలో పన్ను వసూలు కావడం ఇదే తొలిసారి. జనవరి 2022 నెలలో రూ.1,40,986 కోట్లు వచ్చాయి. గత ఏడాది ఇదే నెలలో వచ్చిన జీఎస్టీ ఆదాయాల కంటే ఈ మార్చిలో వచ్చిన ఆదాయాలు 15శాతం ఎక్కువ. మార్చి 2020లో వచ్చిన జీఎస్టీ రాబడి కంటే 46శాతం ఎక్కువగా ఉందని ఆర్థిక మంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఓమిక్రాన్‌ భయాలతో ఫిబ్రవరిలో జీఎస్టీ వసూళ్లు రూ.1,33,026 కోట్లుగా ఉన్నాయి. అధికారిక ప్రకటన ప్రకారం చివరి త్రైమాసికంలో సగటు నెలవారీ స్థూలవసూళ్లు రూ.1.38 లక్షల కోట్లుగా ఉన్నాయి. ఆర్థిక పునరుద్ధరణ, పన్ను ఎగవేత నిరోధక కార్యకలాపాలు, ప్రత్యేకించి నకిలీ బిల్లర్లపై చర్యలు అధికశాతం వసూళ్లకు దోహదం చేస్తున్నాయని ప్రభుత్వం తెలిపింది.

మార్చి నెలకుగాను రూ.1,42,095కోట్ల జీఎస్టీ వసూలైనట్లు కేంద్ర ఆర్థికశాఖ శుక్రవారం వెల్లడించింది. దీనిలో కేంద్ర జీఎస్టీ (సీజీఎస్టీ) రూ.25,830కోట్లు, రాష్ట్రాల జీఎస్టీ (ఎస్‌జీఎస్టీ) రూ.32,378కోట్లు, సమ్మిళిత జీఎస్టీ రూ.74,470 కోట్లు, సెస్‌ రూపంలో రూ.9,389కోట్లు వసూలైనట్లు ఆర్థికశాఖ తెలిపింది. ఇన్‌వర్టెడ్‌ డ్యూటీ స్ట్రక్చర్‌ను సరిచేయడానికి కౌన్సిల్‌ చేపట్టిన వివిధ రేట్ల హెతుబద్ధీకరణ చర్యల వల్ల కూడా ఆదాయం మెరుగుపడిందని అభ్రిపాయ పడింది. కాగా మొత్తం 2021-22 ఆర్థిక సంవత్సరంలో జీఎస్టీ వసూళ్లు రూ.14.83లక్షల కోట్లుగా నమోదయ్యాయి. గత ఆర్థిక సంవత్సరంలో వసూలైన మొత్తం రూ.11.37లక్షల కోట్లుతో పోలిస్తే 30శాతం అధికం.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement