Saturday, April 27, 2024

దేశానికి సరికొత్త బలం.. డ్రోన్ టెక్నాలజీకి ప్రోత్సాహం : మోదీ

  • భారత్‌లో అతిపెద్ద డ్రోన్ మహోత్సవ్..
  • కిసాన్ డ్రోన్ పైలట్లతో ప్రధాని సంభాషణ..

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: డ్రోన్ల రంగం విస్తృత ఉపాధి అవకాశాలను సృష్టించగలదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. భారతదేశంలో అతిపెద్ద డ్రోన్ వేడుక “భారత్ డ్రోన్ మహోత్సవ్-2022”ను ఆయన శుక్రవారం ఢిల్లీలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ‘కిసాన్ డ్రోన్’ పైలట్లతో సంభాషించారు. డ్రోన్ల బహిరంగ ప్రదర్శనను తిలకించడంతోపాటు అంకుర సంస్థల ప్రతినిధులతోనూ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రులు నరేంద్ర సింగ్ తోమర్, గిరిరాజ్ సింగ్, జ్యోతిరాదిత్య సింధియా, అశ్వనీ వైష్ణవ్, మన్సుఖ్ మాండవ్య, భూపేంద్ర యాదవ్‌ సహా పలువురు రాష్ట్ర మంత్రులు, డ్రోన్ పరిశ్రమ అధిపతులు, పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా ప్రధానమంత్రి 150 డ్రోన్ పైలట్లకు ధ్రువీకరణ పత్రాలను ప్రదానం చేశారు. అనంతరం ప్రధాని మోదీ ప్రసంగిస్తూ.. డ్రోన్ల రంగంపై త‌న‌కున్న ఆస‌క్తిని కనబరిచారు. డ్రోన్ల రంగంలో ఆవిష్కరణలు, పారిశ్రామికవేత్తల స్ఫూర్తి, ప్రస్తుత డ్రోన్‌ ప్రదర్శన తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని ఆయన పేర్కొన్నారు. రైతులు, యువ ఇంజనీర్లతో తన సంభాషణ, చర్చల గురించి కూడా ప్రధాని ప్రస్తావించారు. డ్రోన్ల రంగంలో ఎనలేని శక్తి, ఉత్సాహం స్పష్టంగా కనిపిస్తున్నాయని, ఈ దిశగా భారత్‌ బలాన్ని, అగ్రస్థానానికి దూసుకెళ్లాలనే తపనను ఇవి సూచిస్తున్నాయని చెప్పారు. ఫలితంగా ఈ రంగం విస్తృతావకాశాలు కల్పిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

గత ప్రభుత్వాల హయాంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని సమస్యల్లో భాగంగా పరిగణిస్తూ దాన్ని పేదల వ్యతిరేకిగా చిత్రించే ప్రయత్నాలు జరిగాయని ప్రధాని గుర్తుచేశారు. దీనివల్లనే 2014కు ముందు పాలనలో సాంకేతికత వినియోగంపై ఉదాసీన ఉండేదని విమర్శించారు. ఆ మేరకు పరిపాలనలో సాంకేతిక విజ్ఞానం భాగం కాలేకపోయిందని చెప్పారు. ఫలితంగా పేదలు, అణగారిన వర్గాలు, మధ్య తరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చిందని అన్నారు. మరోవైపు కనీస సదుపాయాల కోసం కూడా నానా అవస్థలూ పడాల్సి వచ్చేదని, దీంతో అవి అందవేమోననే నిరాశ, భయం ప్రజల్లో అలముకున్నాయని పేర్కొన్నారు. కాలంతోపాటు మనమూ మారితేనే ప్రగతి సాధించగలమని ఆయన స్పష్టం చేశారు. మారుమూల ప్రజలకు సైతం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సేవలు అందించగలిగామని ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. ఇదే వేగంతో ముందుకు సాగితే మనం అంత్యోదయ లక్ష్యాన్ని అందుకోగలమని స్పష్టం చేశారు. దీంతోపాటు జన్‌ధన్‌, ఆధార్, మొబైల్ (జామ్) వినియోగం ద్వారా పేదలు తమ హక్కులు పొందేలా చేయగలమని చెప్పారు. “దేశానికి సరికొత్త బలం… వేగం… విస్తృతి ఇవ్వడంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని మేము కీలక సాధనంగా మార్చాం” అని శ్రీ మోదీ నొక్కిచెప్పారు.

దేశీయంగా రూపొందించిన పటిష్ఠ ‘యూపీఐ’ ద్వారా నేడు లక్షల కోట్ల రూపాయలు పేదల బ్యాంకు ఖాతాలకు నేరుగా బదిలీ అవుతున్నాయని ప్రధానమంత్రి గుర్తుచేశారు. అలాగే మహిళలు, రైతులు, విద్యార్థులు నేడు ప్రభుత్వం నుంచి నేరుగా సహాయం పొందుతున్నారని తెలిపారు. డ్రోన్ సాంకేతిక పరిజ్ఞానం ఎంతటి పెను విప్లవానికి బాటలు వేస్తుందో చెప్పడానికి ‘పీఎం-స్వామిత్వ యోజన’ను ఒక ఉదాహరణగా ప్రధానమంత్రి ఉటంకించారు. ఈ పథకం కింద తొలిసారి దేశవ్యాప్తంగా వివిధ గ్రామాల్లో ప్రతి ఆస్తినీ ‘డిజిటల్ మ్యాపింగ్’ చేసి ప్రజలకు డిజిటల్ ఆస్తి కార్డులు అందజేస్తున్నట్లు తెలిపారు. “డ్రోన్ సాంకేతికతను ప్రోత్సహించడం అనేది సుపరిపాలన, జీవన సౌలభ్యం దిశగా మా నిబద్ధతను ముందుకు తీసుకెళ్లే మరొక మాధ్యమం. ఈ మేరకు సామాన్య ప్రజానీకం జీవితాల్లో భాగం కాగల అత్యాధునిక ఉపకరణాన్ని డ్రోన్‌ రూపంలో మనం పొందాం” అని ఆయన చెప్పారు.

వ్యవసాయ సమస్యల పరిష్కారంలో డ్రోన్లు కీలకం
రక్షణ, విపత్తుల నిర్వహణ, వ్యవసాయం, పర్యాటకం, చలనచిత్ర, వినోద రంగాల్లో డ్రోన్ల వినియోగం ఎక్కువగా కనిపిస్తోందని ప్రధానమంత్రి ప్రస్తావించారు. భవిష్యత్తులో ఈ సాంకేతికత వినియోగం మరింత పెరగడం తథ్యమన్నారు. ‘ప్రగతి’ సమీక్షలు, కేదార్‌నాథ్ ప్రాజెక్టులపై పర్యవేక్షణను ఉదాహరిస్తూ.. తాను అధికారిక నిర్ణయాలు తీసుకోవడంలో డ్రోన్లు ఉపయోగపడిన తీరును కూడా ప్రధానమంత్రి వివరించారు. రైతుల సాధికారత, వారి జీవితాలను ఆధునీకరించడంలో డ్రోన్ సాంకేతికత ప్రధాన పాత్ర పోషించనుందని ప్రధాని అన్నారు. గ్రామాల్లో రోడ్లు, విద్యుత్, ఆప్టికల్ ఫైబర్, డిజిటల్ సాంకేతికత అందుబాటులోకి వస్తున్నప్పటికీ వ్యవసాయం నేటికీ పాత పద్ధతుల్లోనే సాగుతున్నదని చెప్పారు. ఫలితంగా అనేక చిక్కులతోపాటు ఉత్పాదకత తగ్గిపోవడమే కాకుండా పరిస్థితులు వృథాకు దారి తీస్తున్నాయని స్పష్టం చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement