Friday, April 26, 2024

‘సీపీఆర్‌’తో ప్రాణాలు కాపాడవచ్చు : మంత్రి హరీశ్ రావు

సిద్ధిపేట : సీపీఆర్ నేర్చుకుంటే 50 శాతం మందిని బతికించొచ్చు.. కార్డియాక్ అరెస్టుతో స్పృహ కోల్పోయిన వ్యక్తులను తిరిగి స్పృహలోకి తెచ్చేందుకు సీపీఆర్ విధానం ఎంతో అవసరమని, దేశ వ్యాప్తంగా 2 శాతం మందికి మాత్రమే సీపీఆర్ పై అవగాహన ఉన్నదని, సీపీఆర్ నేర్చుకుని ప్రతి ప్రాణాన్ని కాపాడదామని రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రమైన సిద్ధిపేట పోలీసు కన్వెన్షన్ హాల్ లో ఆదివారం ఉదయం ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులకు వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో సీపీఆర్ పై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన మంత్రి జ్యోతి ప్రజ్వలన చేసి శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ మేరకు సిద్ధిపేట జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్ లు మంత్రి సమక్షంలో స్వయంగా సీపీఆర్ చేసి ప్రాముఖ్యతను వివరించారు. కాగా ఇటీవల సీపీఆర్ చేసి విలువైన ప్రాణాలు కాపాడిన 108 సిబ్బందిని మంత్రి ఘనంగా సన్మానించారు. మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. సీపీఆర్ అనేది ఆత్మీయులు, కుటుంబ సభ్యులకు వస్తే ఎంతో బాధ పడతాం అని, అందుకే సీపీఆర్ నేర్చుకోవడం చాలా అవసరం అన్నారు. దేశంలో సడెన్ కార్డియాక్ అరెస్టుతో 15 లక్షల మంది చనిపోతున్నారు.

రాష్ట్రంలో సడెన్ కార్డియాక్ అరెస్టుతో 4 వేల మంది చనిపోతున్నారు. దేశ వ్యాప్తంగా రెండు శాతం మందికి మాత్రమే సీపీఆర్ పై అవగాహనా ఉంది.. అందరికీ అవగాహన కల్పించాలనే ఉద్దేశించి ప్రభుత్వం సీపీఆర్ శిక్షణ కార్యక్రమం చేపట్టింద‌న్నారు. సీపీఆర్ పై రాష్ట్ర వ్యాప్తంగా 18, 850 మందికి ఇప్పటి వరకు శిక్షణ అందిస్తున్నాం అని, అందరూ నేర్చుకుంటే ప్రతి విలువైన ప్రాణాన్ని కాపాడవచ్చు అన్నారు. హార్ట్ఎటాక్ వేరు సర్డెన్ కార్డియాక్ అరెస్ట్ వేర్వేరుగా ఉంటాయని పలు ఉదాహరణలుగా ఆరోగ్య మంత్రి హరీశ్ రావు వివరించారు. కార్డియాక్ అరెస్ట్ అనేది శ్వాస ఆడకపోవడం, పల్స్ లేకపోవడం ఉంటుందని మంత్రి వెల్లడించారు. రూ.15 కోట్లతో ఏఈడీ మిషనరీలు తెచ్చి ఆసుపత్రులలో అందుబాటులోకి తెస్తాం అని, సీపీఆర్ నేర్చుకుని సిద్దిపేటలో ప్రతి విలువైన మనుషుల ప్రాణాన్ని కాపాడుదాం అన్నారు. ప్రతి బ్యాచ్ లో 20 మంది చొప్పున 1826 బ్యాచ్ లకు శిక్షణ పూర్తి చేశారు. మొత్తం 36,500 మందికి శిక్షణ ఇవ్వడం జరిగింద‌న్నారు. ఈ నెల 13న సంగారెడ్డి జిల్లా కేంద్రంలో పోలీస్ కన్వెన్షన్ సెంటర్ కు శంఖుస్థాపన, తర్వాత మెదక్ జిల్లాలో పోలీసు కన్వెన్షన్ సెంటరు ప్రారంభం చేస్తామ‌న్నారు. సిద్ధిపేట జిల్లా తరహాలోనే పోలీస్ హెల్త్ ప్రోఫైల్ మిగతా అన్నీ జిల్లాలో నిర్వహిస్తాం అన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ రోజాశర్మ, గిడ్డంగి కార్పొరేషన్ చైర్మన్ సాయిచంద్, పోలీసు కమిషనర్ శ్వేత, డీఎంహెచ్ఓ డాక్టర్ కాశీనాథ్, పలువురు ప్రజాప్రతినిధులు, వివిధ శాఖలకు చెందిన ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement