Saturday, April 27, 2024

భూవేలానికి వేళాయె..! గజం కనీస ధర రూ.40 వేలు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: రాష్ట్ర ప్రభుత్వం భూముల అమ్మకం ప్రక్రియ కొనసాగిస్తోంది. పన్నేతర ఆదాయాన్ని సమకూర్చుకోవడంలో ప్రభుత్వానికి భూముల అమ్మకం కీలకంగా మారిన విషయం తెలిసిందే. దీంతో రాజధాని హైదరాబాద్‌లో అభివృద్ధి చేసిన భూములను ముందుగా ప్రభుత్వం విక్రయిస్తోంది. ఈ క్రమంలో తాజాగా హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (హెచ్‌ఎండీఏ) హైదరాబాద్‌ శివార్లలోని తుర్కయంజాల్‌ ప్రాంతంలో అభివృద్ధి చేసిన తొమ్మిదిన్నర ఎకరాల భూమిని అమ్మేందుకు రంగం సిద్ధం చేసింది. ఓపెన్ కాంపిటీటివ్‌ బిడ్డింగ్‌లో భూములను వేలం వేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ వేలానికి హెచ్‌ఎండీఏ మంగళవారం నోటిఫికేషన్‌ జారీ చేయనుంది. హెచ్‌ఎండీఏ నిర్ణయించిన అప్‌సెట్‌ ధర ఆధారంగా ఈ ప్లాట్లన్నీ అమ్ముడైతే ప్రభుత్వ ఖజానాకు ఒక్కరోజులో రూ.100 కోట్లకు పైగా నిధులు సమకూరనున్నట్లు తెలుస్తోంది.

తొమ్మి దిన్నర ఎక రాలను మొత్తం 34 ప్లాట్లుగా అభివృద్ధి చేసిన హెచ్‌ఎండీఏ వీటన్నింటిని వేలంలో విక్రయించనున్నట్లు తెలిపింది. ఈ ప్లాట్లలో 600-700 స్క్వేర్‌ యార్డుల విస్తీర్ణం కలిగిన ప్లాట్లు 14 ఉండగా 701-800 గజాల విస్తీర్ణం కలిగిన ప్లాట్లు 10, 800-850 గజాల విస్తీర్ణం కలిగిన ప్లాట్లు 5, 900-1050 మరో 5 ఉన్నట్లు హెచ్‌ఎండీఏ ప్రకటించింది. ఈ ప్లాట్ల వేలంలో ఒక్కోగజానికి అప్‌సెట్‌ ధరను హెచ్‌ఎండీ రూ.40 వేలుగా నిర్ణయించింది. ఒక్క ప్లాటు బిడ్డింగ్‌ చేయడానికి రూ.5 లక్షలు ఎర్నెస్ట్‌ మనీ డిపాజిట్‌(ఈఎండీ)గా చెల్లించాలని తెలిపింది. వేలంలో విక్రయించే అన్ని ప్లాట్లలో గ్రౌండ్‌ ఫ్లోర్‌తో పాటు 5 అంతస్తులు నిర్మించుకోవచ్చని పేర్కొంది.

ఎఫ్‌డీఐలకు 100 శాతం అనుమతి.

హెచ్‌ఎండీఏ నిర్వహిస్తున్న ఈ-వేలంలో విదేశీ వ్యకలు, కంపెనీలకు అవకాశం కల్పించింది. రియల్‌ ఎస్టేట్‌లో ఆటోమెటిక్‌ రూట్‌లో 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టు బడులకు (ఎఫ్‌డీఐ)లకు అనుమతి ఉండడంతో ఈ అవకాశం కల్పించినట్లు హెచ్‌ఎండీఏ తెలిపింది. అయితే విదేశీ వ్యక్తులు, కంపెనీలు రిజర్వు బ్యాంకు ఆఫ్‌ ఇండియా(ఆర్బీఐ) నిబంధనలు, ఫెమా నిబంధనలకు అనుగుణంగా బిడ్డింగ్‌లో పాల్గొనాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు.

గతంలో కాసుల వర్షం కురిపించిన హెచ్‌ఎండీఏ భూ వేలాలు…

- Advertisement -

గతేడాది హైదరాబాద్‌ ఐటీ కారిడార్‌లో హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో నిర్వహించిన భూముల ఈ వేలం పాటలు గ్రాండ్‌ సక్సెస్‌ అయ్యాయి. దీంతో ప్రభుత్వానికి కాసుల వర్షం కురిసింది. కోకాపేట, ఖానామెట్‌లలో నిర్వహించిన వేలం లలో ప్రభుత్వానికి అతి స్వల్ప వ్యవధిలో ఏకంగా వెయ్యి కోట్ల రూపాయలపైనే సమకూరింది. ఈ వేలం పాటల్లో ఎకరం రూ.60 కోట్లకుపైగా పలకడం హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌ వర్గాల్లోనే కాక దేశవ్యాప్తంగా రియల్‌ఎస్టేట్‌ వర్గాల్లో చర్చనీయాంశమైంది. హెచ్‌ఎండీఏ అభివృద్ధి చేసి అమ్మ కానికి పెట్టిన ప్లాట్లపై కొనుగోలుదారులకు ఉన్న నమ్మకాన్ని ఈ వేలం పాటల విజయం సూచిస్తోందని అధికారులు చెబుతున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement